నాపై భయానక కుట్ర - జగన్ కు అపకీర్తి వద్దనే ముందుకొచ్చా - పేకాట వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
''చాలా చోట్ల మానభంగాలు, హత్యలు, డైవర్స్ కేసుల రూపంలో మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ వదిలేసి, శ్రీదేవి పేకాట ఆడిస్తోందనే వ్యవహారంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేలా ప్యాకేజీ కథనాలు రూపొందించారు. ప్రజల్ని ఆకట్టుకునే రీతిలో అద్భుతమైన హెడ్డింగ్స్ తో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. జరిగిన దానితో నాకే మాత్రం సంబంధం లేదు. కానీ బాధ్యత గల ఎమ్మెల్యేగా, డైనమిక్ సీఎం జగన్ కు అపకీర్తి రావొద్దనే నేను మీడియా ముందుకొచ్చాను..'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి.
అయోధ్య భూమిపూజ: ఓవైసీపై సంజయ్ ఫైర్ - ప్రధాని హోదాలోనే - అలాగైతే మందిరం కూల్చిందెవరు?
అసలేం జరిగిందంటే..
మూడు రోజుల కిందట గుంటూరు జిల్లా పోలీసులు.. పెదకాకానిలో ఓ భారీ పేకాట స్థావరంపై దాడులు చేశారు. ఈ ఘటనలో 30 మందికిపైగా అరెస్టు కాగా, ఖరీదైన కార్లు, సెల్ ఫోన్లు, లక్షల్లో నగదు పట్టుపడ్డాయి. అయితే, పేకట స్థావరాన్ని నిర్వహిస్తోన్న సురేశ్ అనే వ్యక్తి.. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అనుచరుడు కావడంతో ఈ వ్యవహారం రచ్చకు దారితీసింది. పేకాట స్థావరం గురించి ఎమ్మెల్యేకు ముందే తెలుసని, కేసు నుంచి తన అనుచరుల్ని తప్పించేందుకు ఆమె ప్రయత్నాలు చేశారని, అందులో భాగంగా పోలీస్ బాసులకు ఫోన్లు కూడా చేశారంటూ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు ఎమ్మెల్యే ముందుకొచ్చారు. గురువారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన ఆమె, సంచలన వ్యాఖ్యలు చేశారు.
కావాలనే నాపై కుట్ర..
‘‘జరిగిన ఘటనతో నాకు సంబంధం లేదు. ఆ ప్రదేశం కూడా నా నియోజకవర్గం పరిధిలో లేదు. కానీ నేనే పేకాట ఆడిస్తున్నట్లుగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ నన్ను చిత్రవధకు గురిచేశారు. నిందితుల్ని విడిచిపెట్టాలని నేను పోలీసులకు ఫోన్ చేసినట్లు కూడా కొన్ని మీడియా సంస్థలు రాశాయి. పేకాట పర్సనల్ వ్యవహారం, దీంతో నాకేంటి సంబంధం అని కూడా నేనే చెప్పినట్లు ఇంకొందరు రాశారు. ఇవన్నీ చూస్తుంటే.. నాపై పకడ్బందీగా కుట్ర చేశారని అర్థమవుతోంది. ఆ కుట్రదారులు ఎవరో బయటికి రావాలి. మీడియాలో వస్తోన్న ప్యాకేజీ రాతల వెనుక ఎవరున్నారో బయటపడాల్సిందే'' అని శ్రీదేవి ఆగ్రహించారు.
ఎన్నో చూశాను.. ఇంత నీచమా?
తన రాజకీయ ప్రస్థానంలో శవరాజకీయాలు, కుళ్లు రాజకీయాలు చాలానే చూశానని, మొదటి సారి పేకాట రాజకీయాలు చూస్తున్నానని తాడికొండ ఎమ్మెల్యే వాపోయారు. సంబంధం లేని విషయాన్ని తనకు అంటగట్టడానికి ప్రయత్నించిన వాళ్లను ఊరికే వదిలిపెట్టబోనని, తప్పుడు కథనాలు రాసిన వాళ్లు, దాని వెనకున్న వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని, ఐజీని ఇదివరకే కలిశానని, డీజీపీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు శ్రీదేవి తెలిపారు. తనపై ఉద్దేశపూర్వకంగా సాగుతోన్న కుట్ర వల్ల ఎవరికి, ఏ విధంగా లబ్ధి జరుగుతుందో, వాళ్లెందుకిలా చేయిస్తున్నారనే విషయాలు కూడా తేలాల్సి ఉందని, పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటికొస్తాయని ఎమ్మెల్యే అన్నారు.
చైనా షాకింగ్: అక్సాయ్ చిన్ లో అలజడి - లదాక్ నుంచి పూర్తిగా వెనక్కి - టీ90 యుద్ధ ట్యాంకులతో భారత్
డాక్టర్ కదా సాఫ్ట్ అనుకోద్దు..
పవిత్రమైన వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, ముఖ్యమంత్రి జగన్ నాయకత్వాన్ని చూసి, తాడికొండ నియోజకవర్గంలోని 2 లక్షల మంది ప్రజలు తనకు ఓటేశారని, అలా ఎమ్మెల్యేగా గెలిచిన తన పరిస్థితే ఇలా ఉంటే, మిగతా మహిళల దుస్థితి తల్చుకుంటేనే బాధగా ఉందని, సమాజంలో మహిళలపై ఈ రకంగా కూడా అణచివేత కొనసాగుతున్నదని శ్రీదేవి అన్నారు. ‘‘డాక్టర్ కదా సాఫ్ట్ గా ఉంటుంది అనుకున్నారేమో. నిజమే ఇంతకాలం నేను కూడా చాలా ఓపిక పట్టాను. కానీ ఇకపై దేన్నీ భరించబోను. నాపై తప్పుడు కథనం రాసినవాళ్లు, రాయించినవాళ్లపై పరువునష్టం దావా వేస్తాను'' అని ఎమ్మెల్యే హెచ్చరించారు.
Recommended Video
వైసీపీలో విభేదాలతోనే గుట్టు రట్టు..
విజయవాడ-గుంటూరు హైవేకు పక్కనున్న పెదకాకానిలో విల్లాలు వెలిసిన ఖరీదైన ప్రాంతంలో పేకాట స్థావరం బయటపడటం రెండు జిల్లాల్లో సంచలనం రేపింది. పోలీసులంతా కొవిడ్, లాక్ డౌన్ విధుల్లో బిజీగా ఉండగా, పేకాట రాయుళ్లు రెచ్చిపోతూ, టోకెన్ పద్ధతిలో వ్యవహారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈనెల 27న జరిగిన దాడుల్లో ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు సురేశ్ తోపాటు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలే గుట్టు రట్టు కావడానికి కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులంటే గిట్టని వ్యక్తులే గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫోన్ చేసి పేకాట స్థావరం హింట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఎమ్మెల్యే శ్రీదేవికి, ఎంపీ నందిగం సురేశ్ కు మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో.. ‘కుట్రదారులు' అంటూ ఆమె చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.