ఇక ఒక్క ఏడాదే: టీడీపీకి రోజా విజ్ఞప్తి, పవన్ కళ్యాణ్కు దేవినేని కౌంటర్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు కనీసం తమ పరిపాలన చివరి రోజుల్లో అయినా రాష్ట్రం కోసం పని చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం హితవు పలికారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్పై విమర్శలు గుప్పిస్తున్న వారిపై ఆమె విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా జగన్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
Recommended Video
ప్రజల వద్దకు వెళ్తున్న ఏకైక నాయకుడు జగన్ అన్నారు. జగన్ పట్ల వెన్నముకలేని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రవర్తిస్తున్న తీరు టీడీపీ నేతలు ఎలాంటి వారో సూచిస్తోందన్నారు. కనీసం చివరి రోజుల్లో అయినా నవ్యాంధ్ర కోసం పని చేయాలని తాను టీడీపీ నేతలను కోరుతున్నానని చెప్పారు. 2019 నుంచి వైసీపీ పాలించబోతోందన్నారు.
పక్కా ప్లాన్తో పర్యటన, దాడితో పవన్ భేటీ: జనసేనలోకి విశాఖ ఎంపీగా పోటీ చేసిన నేత
జగన్కు ముఖ్యమంత్రి కావాలన్న పిచ్చి పట్టి రోడ్ల వెంట తిరుగుతున్నారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రజలవని, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. తాము ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.1,590 కోట్లు ఖర్చు చేశామన్నారు.
గతంలో పదవుల్లో ఉన్న వారు ఉత్తరాంధ్రకు ఏం చేయలేదన్నారు. అప్పట్లో ప్రాజెక్టుల పేరుతో డబ్బులు కాజేసేందుకే ప్రయత్నించారన్నారు. పదేళ్లలో తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో నీళ్లు ఇచ్చామని, ఇప్పుడు తోటపల్లి ప్రాజెక్టులో సెల్ఫీలు తీసుకున్న నేతలు తమని ఎలా విమర్శిస్తారని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రశ్నించారు.