బాబూ! నీ ప్రభుత్వం ఎందుకు, దయచేసి నా కొడుక్కి హాని చేయకండి: విజయమ్మ భావోద్వేగం
హైదరాబాద్/అమరావతి: భగవంతుడి దయ వల్లే తన తనయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి నుంచి బయటపడ్డారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆదివారం చెప్పారు. కత్తి దాడి నుంచి కోలుకోవడం తన కొడుకుకు పునర్జన్మ అని చెప్పారు.
మీరా.. నేనా, మీ నాన్నే చెప్పారు: నారా లోకేష్కు వీడియోతో పవన్ కళ్యాణ్ ఝలక్
రాష్ట్ర ప్రజలను వైయస్ రాజశేఖర రెడ్డి తన కుటుంబ సభ్యులను చూసినట్లుగా చూశారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర సమస్యలపై తన కొడుకు రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు. జగన్ను ప్రజలే కాపాడుకుంటున్నారని ఆమె అన్నారు.
నిరాధార ఆరోపణలు భరిస్తున్నాం
తమపై, తమ కుటుంబంపై ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలను మౌనంగా భరిస్తున్నామని విజయమ్మ చెప్పారు. ఇటీవల టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జగన్ పైన దాడి వెనుక విజయమ్మ, షర్మిలల హస్తం ఉండవచ్చునని, ఆయన చనిపోతే అతని ఫోటోతో ఓట్లు దండుకోవాలని, పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి విజయమ్మ పైవిధంగా స్పందించారు.
ఇక నీ ప్రభుత్వం ఎందుకు?
జగన్ జైలులో ఉన్న 16 నెలలు తప్ప మిగిలిన అన్ని రోజులు జనం మధ్యనే ఉన్నారని విజయమ్మ చెప్పారు. ప్రతిపక్ష నేతగే భద్రత కల్పించలేని ప్రభుత్వం ఎందుకని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ పైన హత్యాయత్నం కేసులో తూతూ మంత్రంగా విచారణ సాగుతోందని చెప్పారు. జనం లేని చోట జగన్ పైన దాడి చేయాలని భావిస్తున్నారని చెప్పారు.
మహిళల్నీ తిడుతున్నారు, సీబీఐ విచారణకు భయమెందుకు?
తమ కుటుంబంలోని మహిళలను కూడా తిడుతున్నారని విజయమ్మ వాపోయారు. దాడి జరిగి పదిహేను రోజులు అయినప్పటికీ కేసు దర్యాఫ్తు ముందుకు సాగినట్లుగా కనిపించడం లేదన్నారు. ఈ దాడిపై విచారణ అవసరం లేదని చంద్రబాబు ఎలా అంటారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపేందుకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు.
ఎప్పుడు లేని అభిమాని ఇప్పుడెలా పుట్టుకువచ్చాడు
గత ఆరు నెలలుగా విశాఖపట్నం విమానాశ్రయానికి జగన్ వచ్చి పోతున్నారని విజయమ్మ చెప్పారు. ఎప్పుడూ లేని అభిమాని ఇప్పుడు ఎలా వచ్చారో చెప్పాలని నిలదీశారు. జగన్ పైన హత్యాయత్నంపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కొడుకు పైనే సీబీఐ విచారణ చేయించిన ఏకైక నేత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య జరిగిందని, అసెంబ్లీలో జగన్ పైన చంద్రబాబు ఆరోపణలు చేస్తే, సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం రోజుకో అబద్దపు ఫ్లెక్సీలు సృష్టించి, హత్యాయత్నం కేసును ఇఫ్పుడు తప్పుదారి పట్టిస్తోందన్నారు.
ఇదేనా నీ అనుభవం
అలిపిరిలో చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగిన సమయంలో తన భర్త వైయస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్లి అతనిని ఓదార్చారని విజయమ్మ గుర్తు చేశారు. నేడు అదే పనిని చంద్రబాబు ఎందుకు చేయలేదన్నారు. అప్పట్లో ఆసుపత్రిలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి కౌగిలించుకుని, దేవుడు గొప్పవాడు బాబూ, దేవుడి దయవల్ల రక్షించబడ్డావని చెప్పి, ఓదార్చారని గుర్తు చేశారు. గాంధీ విగ్రహం వద్ద కూర్చుని ధర్నా కూడా చేసిన సంస్కృతి ఆయనది అన్నారు. మరి చంద్రబాబు సంస్కృతి ఏమిటన్నారు. నేను అడుగుతూ ఉన్ననని, ఇదేనా సుదీర్ఘ రాజకీయ అనుభవమని, నీకు ఏమైందని ప్రశ్నించారు. జగన్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం పరామర్శించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉన్నా, ఆయన ఆ పని చేయలేదన్నారు. జనం నుంచి జగన్ను వేరు చేయలేరన్నారు.
దయచేసి నా కొడుక్కు హాని చేయకండి
దయచేసి నా కొడుకుకు ఎలాంటి హానీ చేయకండని విజయమ్మ ఆవేదనగా చెప్పారు. తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయిన తాను తన కొడుకు జగన్ను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు. జగన్ ఇక మీ బిడ్డ అని, అతనిని మీరే చూసుకోవాలని విజయమ్మ ప్రజలను కోరారు. రెండు వారాల అనంతరం తన కొడుకు రేపటి నుంచి పాదయాత్ర చేయబోతున్న సందర్భంగా మాట్లాడిన విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. నేడు జగన్ తిరిగి విజయనగరం బయలుదేరుతున్నానని, జనం కోసం ఆయన వెళ్తున్నారని, వైయస్ ఓ మాట చెప్పేవారని, కొనసాగించమని చెప్పేవారని, మధ్యలో ఆఫకూడదని చెప్పేవారని, అదే నాయకుడి లక్షణం అనే వారన్నారు. జగన్ కూడా అవే లక్షణాలు కలిగి ఉన్నాడన్నారు. నాడు ఎలాగైతే ప్రజలకు అప్పగించానో, ఇప్పుడు అదే పని చేస్తున్నానని చెప్పారు. జగన్ క్షేమం కోసం నేను ప్రార్థన మాత్రమే చేయగలనని, భరోసా ఇవ్వాల్సింది, మాట ఇవ్వాల్సింది మీరేనని, రెండు చేతులు జోడింజి విజ్ఞప్తి చేస్తున్నానని, నా కొడుకును కాపాడండి, ఆశీర్వదించండి అన్నారు.