బ్యాలెట్ బాక్సులో బయటపడ్డ మందుబాబు చీటీ... చదివి అవాక్కయిన అధికారులు...
ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లపై ప్రతిపక్షాలు చాలాకాలంగా పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శించారు.మందు బాబులు కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ఏకంగా బ్యాలెట్ బాక్సునే ఉపయోగించుకున్నాడు.
అనంతపురం జిల్లాలోని నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లిలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా... బ్యాలెట్ బాక్సులో ఓ చీటి బయటపడింది. అందులో రాసింది చదివి కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు. ఇంతకీ అందులో ఏముందంటే... 'నల్లచెరువు వైన్ షాపులో కూలింగ్ బీర్లు పెట్టాలని కోరుతున్నాను.షాపులో మంచి బ్రాండ్లు పెట్టాలి.ఇట్లు నల్లచెరువు యూత్ మందుబాబుల అధ్యక్షుడు.' అని రాసి ఉంది. ఎవరో మందుబాబు ఓటింగ్ సందర్భంగా తన ఓటుతో పాటు ఈ చీటిని కూడా బ్యాలెట్ బాక్సులో వేసి వెళ్లడంతో... కౌంటింగ్ వేళ అది బయటపడింది.
ఏపీలో విక్రయిస్తున్న లిక్కర్ బ్రాండ్లపై చాలా విమర్శలే ఉన్నాయి.దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు రాష్ట్రంలోనే దొరుకుతున్నాయని... నాసిరకం బ్రాండ్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకి ఫిర్యాదు చేశారు.దీంతో ఏపీలో మద్యం బ్రాండ్లపై పరిశీలన జరుపుతామని కేంద్రమంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించి... మద్యం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే నాసిరకం మందు బ్రాండ్లు,ఇంతకుముందెన్నడూ వినని బ్రాండ్లను ఏపీ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ నేతల జేబులు నింపుకునేందుకే వీటిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు.ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలు,ఆరోపణలను పెద్దగా పట్టించుకోవట్లదనే చెప్పాలి.
కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ :
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కనిపించింది. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇక్కడి నాలుగు మండలాల్లో వైసీపీనే ఆధిపత్యం సాధించింది.నియోజకవర్గంలోని మొత్తం 66 ఎంపీటీసీ సీట్లలో 63 వైసీపీకే వచ్చాయి. నాలుగు జడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. జిల్లా పరిషత్ కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గిరిజా శంకర్ పేర్కొన్నారు.