నువ్వు అన్న కాదు!: జగన్ చెప్పిన మాటతోనే ఆదినారాయణ రెడ్డి కౌంటర్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మంగళవారం నిప్పులు చెరిగారు. జగన్ వ్యాఖ్యలతో ఆయనకే వారు కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనం
జగన్ ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాను అధికారంలోకి వస్తే 45 ఏళ్లకు వృద్ధాప్య పించన్ ఇస్తామని చెప్పారు. దీనిని టిడిపి నేతలు ఆయుధంగా మలుచుకున్నారు.
జగన్ ఫార్ములా మార్చారా?
జగన్ వ్యాఖ్యలతో సోమిరెడ్డి, ఆదినారాయణలు సెటైర్లు వేశారు. సాధారణంగా 65 ఏళ్లు దాటితే వృద్ధులు అంటారని, వృద్దాఫ్య ఫించన్ విషయంలో జగన్ ఫార్ములాను ఏమైనా మార్చారా అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే అందరినీ ముసలివాళ్లను చేస్తున్నాడని విమర్శించారు.
జగన్ అన్న కాదు.. జగన్ తాతయ్య
రెండు రోజుల్లో పుట్టిన రోజు చేసుకోబోతున్న జగన్కు కూడా 45 ఏళ్లు వస్తాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పాదయాత్ర చేస్తోంది.. జగనన్న కాదని, జగన్ తాతయ్య అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు అన్న వస్దున్నాడు అనే బదులు తాతయ్య వస్తున్నాడని నినాదం ఇవ్వాలని సూచించారు.
రూ.12,500 ఇస్తానని జగన్
వైయస్ జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రూ.12,500 చొప్పున ఇస్తానని చెప్పారు. పాదయాత్రలో రైతుల నుంచి వచ్చిన వినతులను, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
చంద్రబాబుకు అనుభవం ఎందులో
చంద్రబాబు ఎప్పుడూ తనకు అనుభవం ఉందని చెబుతుంటారని, ఆయన అనుభవం రైతులకు వెన్నుపోటు పొడవడంలోనా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబే ఓ దళారి కాబట్టి రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇచ్చింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంతో పాటు రైతులకు అండగా నిలుస్తామన్నారు.
వరుస కరువులు, పంటలకు గిట్టుబాటులేక
వరుస కరవులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదన్నారు. ధరల స్థిరీకరణకు రూ.మూడు వేల కోట్లు, కరవు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సహాయనిధి కింద రూ.రెండు వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. రైతులు పంట సాగు చేసే సమయంలోనే గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్నారు. ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు నవరత్నాలను ప్రకటించామని, వాటిలో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమన్నారు.