ప్లాట్ల పంపిణీ: రైతుల్లో అంతర్మథనం, ఇరుకునపడ్డ టిడిపి నేతలు!
అమరావతి: సమీకరణ ద్వారా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద మంగళవారం పిచ్చుకలపాలెం, దొండపాడు గ్రామానికి చెందిన రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఇప్పటి వరకు నేలపాడు, శాఖమూరులో ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి సూచనలు, సలహాలు అవసరమని చెప్పారు.
రాజధాని రైతుల్లో అంతర్మథనం!
అమరావతి కోసం భూమిని ఇచ్చిన రాజధాని ప్రాంత రైతుల్లో కొందరిలో అంతర్మథనం కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పీ నారాయణలు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. వారు ఇచ్చిన హామీలతో మూడు పంటలు పండే భూమిని ఇచ్చామని వాపోతున్నారంటున్నారు. కొందరు రైతుల్లో ఆందోళన నేపథ్యంలో స్థానిక టిడిపి నేతలు కూడా వారి వైపే ఉంటామని చెబుతున్నారట.
ఎన్నో హామీలు
భూములు తీసుకునే సమయంలో మంత్రులు నారాయణ, పుల్లారావులు వెంకటపాలెంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ప్లాట్లు, కౌలు, కూలీలకు పింఛన్లు, గ్రామ అభివృద్ధికి రూ.30 లక్షల నిధులు వంటి హామీలు ఇచ్చారు.
ప్లాట్ల పంపిణీ
ముందు ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి వెంకటపాలెం నుంచే మొదలు పెడతామని హామీ ఇచ్చారని అంటున్నారు. అంతేకాకుండా 2.50 ఎకరాల్లో గ్రీన్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, మంత్రులు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఇప్పుడు రైతులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.
వెంకటపాలెంతో పాటు..
ప్లాట్ల పంపిణీ వెంకటపాలెం నుంచి ప్రారంభించకపోయినా.. ఇప్పటి వరకు ప్లాట్లకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని వాపోతున్నారని తెలుస్తోంది. గ్రామంలో కాకుండా వేరొక చోట్ల ప్లాట్లు కేటాయించనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయని అంటున్నారు. వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చి రెండేళ్లవుతున్నా తమ ప్లాట్ల మాట ఏమిటని స్థానిక టిడిపి నేతలను అడుగుతున్నారు. దీంతో వారు ఇరుకున పడుతున్నారు. వారు సమాధానం చెప్పలేకపోతున్నారని చెబుతున్నారు. వెంకటపాలెంతో పాటు పలు గ్రామాల ప్రజలు ఆవేదనగా ఉన్నారంటున్నారు.