రామోజీరావు, అశోక్ గజపతిరాజులకు మోడీ ప్రశంస: జయలలితకూ..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన 'మన్ కీ బాత్'లో రామోజీ రావు పైన, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ, ఏపీల్లో ఈటీవీ - ఈ నాడు స్వచ్ఛ భారత్ను ఉధృతంగా నిర్వహించాయన్నారు.
రామోజీ రావు వ్యక్తిగతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలో నిర్వహిస్తున్నారన్నారు. ఆయన వయసులో పెద్దవారైనా యువకుడిలా పని చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 51 లక్షల మంది విద్యార్థులను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారన్నారు.
ఆసుపత్రులు, బస్ స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైనా ప్రశంసలు కురిపించారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడిని అశోక్ గజపతి రాజు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీల కృషిని మెచ్చుకున్నారు.
అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య సేవలు అవయవాల మార్పిడిని సులభం చేశాయన్నారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా తమిళనాడు ముందు నిలిచిందన్నారు.
కిడ్నీలు, గుండె, కాలేయం తదితరాల మార్పిడిలో తమిళనాట ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి ఎంతో సహాయం అందుతోందని, అవయవాలు సత్వరం చేరేందుకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ముందుకు సాగాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటర్వ్యూలు లేకుండానే దగ్గర కానున్నాయి. కేవలం రాత పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. గ్రూప్ బి, సి, డి ఉద్యోగాల నియామకాల్లో ఇకపై ఇంటర్వ్యూలు ఉండవన్నారు. ఇంటర్వ్యూల సమయంలో అవినీతి అధికంగా జరుగుతోందన్న ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.