ఏపీలో ముందస్తు ప్రచారం- జగన్, చంద్రబాబుకు మోడీ ఏం చెప్పారు ? రోడ్ మ్యాప్ అమలు వేళ!
ఏపీలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నట్లు ఇక్కడి రాజకీయ పార్టీలు, వాటి అధినేతలైన జగన్, చంద్రబాబు తమ నేతలకు, కార్యకర్తలకు పరోక్షసంకేతాలు ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వైసీపీ గడప గడపకూ ప్రభుత్వం, టీడీపీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలను క్షేత్రస్దాయిలో కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నేతల్లోనూ ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. కానీ కేంద్రం మాత్రం ఇందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తాజాగా సీఎం జగన్, చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఈ మేరకు సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది.
మోడీతో జగన్, చంద్రబాబు
నిన్న ఢిల్లీలో జీ20 సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం జగన్, చంద్రబాబు ఈ భేటీకి హాజరైన ప్రధాని మోడీతో కాసేపు చిట్ చాట్ చేశారు. విశాఖ టూర్ తర్వాత తనను కలిసిన జగన్ తో పాటు చాలా కాలం తర్వాత కలిసిన చంద్రబాబునూ ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపైనా మాట్లాడారు. ముఖ్యంగా ఏపీలో పరిస్ధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇందులో రాష్ట్రంలో మారుతున్న రాజకీయంపై ఇరువురు నేతలకు ఓ క్లారిటీతో కూడిన సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ముందస్తుపై మోడీ క్లారిటీ?
ఏపీలో ప్రస్తుతం ముందస్తు ఎన్నికలపై ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ తమ పార్టీ నేతల్ని పరుగులు పెట్టిస్తున్న తీరుతో రాష్ట్రంలో ముందస్తు ఖాయమనే ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో చంద్రబాబు కూడా తమ పార్టీ నేతల్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పదే పదే సూచిస్తున్నారు. అంతే కాదు ఎన్నికల ప్రచారం తరహాలోనే ఆయన జిల్లాల టూర్లు, సభలు ఉంటున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే అంచనాకు అందరూ వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ జగన్, చంద్రబాబుకు ముందస్తుకు సంబంధించిన కీలక సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ముందస్తుకు మోడీ నో?
ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జగన్, చంద్రబాబుకు ప్రధాని మోడీ నిన్న సంకేతాలు ఇచ్చినట్లు ఢిల్లీ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం ఏపీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్ధితులు లేవనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారానికి తాత్కాలికంగా అయినా ఫుల్ స్టాప్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగో ముందస్తు ఎన్నికల్ని ఏపీ విపక్షాలు కోరుకోవడం లేదు. పరిస్ధితులు ఏవైనా తేడా వస్తే జగన్ కోరుకునే అవకాశాలున్నాయి. కానీ మోడీకి ఇష్టం లేకుండా ఆయన కూడా ముందస్తుకు వెళ్లే అవకాశాల్లేవనే చెప్పుకోవచ్చు.
రోడ్ మ్యాప్ అమలు కోసమేనా?
ఏపీలో విశాఖ టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని వైసీపీపై పోరు కోసం రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతానికి చంద్రబాబు లేకుండా కేవలం బీజేపీ-జనసేన కూటమి రూపంలో పోరు కొనసాగించాలని ఆయనకు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే చంద్రబాబుతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం లేదని, టీడీపీ జనంలో నిరూపించుకుంటే అప్పుడు కలిసి ముందుకు సాగే విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని పవన్ కు చెప్పినట్లు ప్రచారం జరిగింది.
ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికల అవసరం లేదని, నిర్ణీత సమయంలోనే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాల్ని ప్రధాని జగన్, చంద్రబాబుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ముందస్తు ప్రచారానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడనుంది.