ఈఎస్ఐ స్కాంపై అచ్చెన్నాయుడు: ప్రధాని మోడీ ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే..
Recommended Video
ఈఎస్ఐ స్కాంపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని తెలిపారు. కానీ కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు లేఖ
తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈఎస్ఐ స్కాం జరిగిందని విజిలెన్స్ విభాగం వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పటి కార్మిక శాఖమంత్రి అచ్చెన్నాయుడు లేఖతో అధికారులు టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్ధతిలో మందులు కేటాయించారని.. దీంతో రూ.150 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. విజిలెన్స్ శాఖ రిపోర్ట్తో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు రేగాయి. దీంతో మాజీమంత్రి అచ్చెన్నాయుడు మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన విషయాలను వివరించారు.
మోడీ ఆదేశంతో..
మెడికల్ కొనుగోళ్లను టెండర్ పద్ధతిలో కొనుగోలు చేయాల్సి ఉండగా.. టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్దతిలో కట్టబెట్టారు. నామినేషన్ పద్దతి, ఆర్డర్ ఇచ్చారని అచ్చెన్నాయుడు పేరును విజిలెన్స్ శాఖ బయటపెట్టింది. 2016 నుంచి 1027 ఏప్రిల్ వరకు తాను కార్మికశాఖ మంత్రిగా పనిచేశానని అచ్చెన్నాయుడు తెలిపారు. 2016 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నిరాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు. భేటీలో టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్ధతిలో మందులు ఇవ్వాలని సూచించారని తెలిపారు.
కేంద్రం నుంచి లేఖ..
ప్రధానితో భేటీ తర్వాత కేంద్రప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయని అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నిరాష్ట్రాల కార్మికశాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖ రాశారని చెప్పారు. అందులో కూడా టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్ధతిలో మందులు కేటాయించాలని ఆదేశించారని వెల్లడించారు. తర్వాత రివ్యూ మీటింగ్ నిర్వహించి.. సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు తీర్మానం కూడా రాశామని చెప్పారు. టెలీ హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిలో మరే రాష్ట్రంలో అమలు చేస్తున్నారా అని అధికారులను అడిగానని.. వారు తెలంగాణలో అమలు చేస్తున్నారని సమాధానం ఇచ్చారన్నారు. అయితే తెలంగాణలో ఏ విధానాలు అవలంభిస్తున్నారో ఏపీలో కూడా అలానే వ్యవహరించాలని లేఖ రాశానని స్పష్టంచేశారు.
దుష్ప్రచారం తగదు..
కానీ కొన్ని మీడియా సంస్థలు అవినీతి జరిగిందని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను ఇప్పుడు, ఎప్పుడూ అవినీతి చేయబోనని స్పష్టంచేశారు. ఇంజెక్షన్, మాత్ర ఇవ్వాలని కూడా ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నారు. ఇదివరకు జరిగిన కొనుగోళ్లకు సంబంధించి కూడా టెండర్ల ద్వారానే మందలు కొనుగోలు, వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని సూచించానని పేర్కొన్నారు.