గురువు అద్వానీకే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ, నాకు ఓటమి భయమా?: చంద్రబాబు
గుంటూరు: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు, ఇలాంటి వాటిల్లో తన కంటే ఆయన సీనియర్ అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తనను తిట్టేందుకే ఢిల్లీ నుంచి వచ్చారని, ఏపీకి ఏం చేసారో జవాబు చెప్పలేకపోయారని అన్నారు.
అన్నీ చెప్పేస్తారు!: నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?
గురువుకు పంగనామాలు పెట్టారు
నేను తన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచానని మోడీ చెప్పారని, కానీ గురువు అద్వానీకి పంగనామం పెట్టారని చంద్రబాబు చెప్పారు. గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి నాకు చెబుతున్నారన్నారు. అద్వానీకి ప్రతి నమస్కారం పెట్టని వ్యక్తి మోడీ అన్నారు. సీనియర్లను గౌరవించే సంస్కారం లేని వ్యక్తి మోడీ అన్నారు. తాము ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. మోడీ వ్యక్తిగతంగా మాట్లాడారని, తాను ఓడిపోవడంలో సీనియర్ అని చెప్పారని, కానీ వరుసగా గెలుచుకుంటూ వచ్చానని చెప్పారు.
కాంగ్రెస్తో కలవడంపై
కాంగ్రెస్ పార్టీతో, కేంద్రంతో, కేంద్ర దురహంకారంతో ఆనాడు ఎన్టీఆర్, నేను పోరాడామని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీ వద్దకు వెళ్లి మోకరిల్లలేదని, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఇక్కడ ఉన్నానని చెప్పారు. ఎవరైనా మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటానని, లేదంటే వదిలే సమస్య లేదని చెప్పారు. తమను అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పారు. ఛాయ్ వాలాను అంటూనే కోట్లు విలువ చేసే సూట్లు, బూట్లు వేసుకుంటున్నారని, తాను మాత్రం ఎప్పుడు ఇదే దుస్తులు వేసుకుంటున్నానని చెప్పారు.
ఓడిపోయే భయం ఉందని, బాధ వేసింది
తనకు ఓడిపోయే భయం వచ్చిందని మోడీ అంటున్నారని, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారని, తనకు బాధ వేసిందని చంద్రబాబు అన్నారు. ఆయన ఏదో లెక్కలు అడిగినట్లు, నేను చెప్పినట్లుగా అబద్దాలు చెబుతున్నారని అన్నారు. మా వద్ద అకౌంటెంట్లు ఉంటారని, వారు లెక్కలు చెబుతారని, మేం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే కాగ్ ఉందని, నీతి అయోగ్ ఉందని చెప్పారు. బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. మేం పన్నులు కడుతున్నామని, ఈ దేశంలో మాకు వాటా ఉందని చెప్పారు. ఏపీకి కేంద్రం రూ.లక్ష కోట్లు ఇవ్వాలని చెప్పారు. నీతి ఆయోగ్ చెప్పిన ప్రధాని కార్యాలయం నిధులు ఇవ్వలేదని చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా 15 సీట్లు తక్కువ గెలిచామని చెప్పారు. జగన్ మెడపై సీబీఐ కత్తి వేలాడుతోందన్నారు.
ఎక్కడకు వెళ్లినా గో బ్యాక్
మేం గో బ్యాక్ అని చెప్పింది.. మీరు మళ్లీ గుజరాత్కు వెళ్లాలని, అంతేకానీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని తాము కోరుకోవడం లేదని చంద్రబాబు చెప్పారు. మోడీ దేశాన్ని విభజించేలా పాలిస్తున్నారని, ద్వేషం పెంచుతున్నారని అన్నారు. అసోం వెళ్లినా, కేరళ వెళ్లినా, తమిళనాడు వెళ్లినా, ఏపీకి వచ్చినా గో బ్యాక్ అంటున్నారని చెప్పారు. ప్రధాని కుర్చీలో కూర్చోవడానికి అర్హుడు కాదని గో బ్యాక్ అన్నామని చెప్పారు. తాము గుజరాత్ను మించిపోతామని మోడీకి భయం పట్టుకుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో సమానం కావాలంటే ఏపీకి అరవై ఏళ్లు పడుతుందని చెప్పారు.