విజయవాడ-గూడూరు రైల్వేలైన్ నిర్మాణం: పనుల పురోగతిపై ప్రధాని మోడీ ఆరా
Recommended Video
అమరావతి: విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైన్ నిర్మాణం విషయమై రైల్వేబోర్డు చైర్మన్ అశ్వని లోహానీ ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ప్రధాని మోడి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని లోహాని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి తెలిపారు. ఏపీలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ భూమి, ఇతర భూసేకరణ వివరాలను ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్కుమార్ ప్రధానికి తెలిపారు.
దేశంలో ప్రధాన రైల్వే మార్గమైన కలకత్తా- మద్రాసు మార్గానికి రెండు లైన్లు ఉండటం చేత ప్రధానంగా రైల్వేకి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లను సకాలంలో గమ్యానికి పంపడం తలకు మించిన భారంగా మారింది. దీనికి పరిష్కారంగా మూడో లైను నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. దీంతో విజయవాడ-గూడూరు మధ్య మూడవ లైను ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది.
ఈ ప్రాంతం నవ్యాంధ్ర రాజధాని పరిధిలో ఉండటంతో రాజధాని అమరావతికి అనుసంధానంగా కొత్త రైల్వే లైన్లు, రైళ్ల కనెక్టివిటీ పెరిగేలా హౌరా - చెన్నై ప్రధాన రైలు మార్గంలో విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరుకు రవాణా రైళ్లు, ప్రయాణికుల రైళ్లకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి కారిడార్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఎన్నో ఏళ్ల నుంచి భావిస్తున్నారు.
ఈ మూడో లైన్ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్ రైల్వే అభివృద్ధికి కీలకం కానుంది. పలు రైళ్లు తెనాలి మీదుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు తెనాలి రైల్వే స్టేషనను ఆధునికీకరణ జాబితాలో కూడా రైల్వే శాఖ చేర్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది.
ప్రస్తుతం విజయవాడ - గూడూరు మార్గంలో రెండు లైన్లు ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలుతో పాటు గూడ్సు రైళ్లు అధిక సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రద్దీ కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో భవిష్యత్తులో ఈ రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి వీలుగా మూడో లైను ఏర్పాటు ఆవశ్యం.
అనంతరం ఆ తరువాత ఎన్నోర్-తిరువళ్లూర్-బెంగళూరు-పుదుచ్చేరి-నాగపట్నం-మదురై-టూటికోరన్ గ్యాస్ పైప్ లైన్ గురించి కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంఎం కుట్టీ ప్రధాని మోడీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 1244 కిలోమీటర్ల పొడవున ఈ పైప్ లైన్ నిర్మిస్తారని చెప్పారు. ఈ పైప్ లైన్ ని 5 దశలలో నిర్మిస్తారని, ఫారెస్ట్ భూమి, ప్రైవేటు భూమికి సంబంధిచి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.