సీఎం జగన్కు భారీ షాక్.. బీజేపీలోకి మంచు ఫ్యామిలీ.. ప్రధాని ఆహ్వానంతో..
ప్రముఖ టాలీవుడ్ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా కొనసాగుతోన్న మంచు మోహన్ బాబు సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కూతురు లక్ష్మీ ప్రసన్న, కొడుకు మంచు విష్ణులతో కలిసి పీఎంవోకు వెళ్లిన మోహన్ బాబు.. సుమారు అరగంటపాటు ప్రధానితో మంతనాలు జరిపారు. టాలీవుడ్ తోపాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన మోహన్ బాబు అండ్ ఫ్యామిలీని బీజేపీలో చేరాలంటూ మోడీ ఆహ్వానించారు. ప్రధాని విన్నపానికి పాజిటివ్ గా స్పందించిన మంచు ఫ్యామిలీ కాషాయ కండువా కప్పుకోడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మోడీతో భేటీ తర్వాత మంచు లక్ష్మీ చేసిన ప్రకటన కూడా ఇందుకు ఊతమిచ్చేలా ఉంది.
అమిత్ షాతోనూ భేటీ.. ఇవాళే చేరిక?
మధ్యాహ్నం ప్రధాని మోదీని కలుసుకున్న మంచు కుటుంబం.. బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాన కల్పించేందుకు బీజేపీ తలపెట్టిన ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో అమిత్ షా బిజీగా ఉన్నప్పటికీ.. మోహన్ బాబు ఫ్యామిలీ కోసం టైమ్ చేటాయించారు. ఇవాళ సాయంత్రమే షా సమక్షంలో మంచు ఫ్యామిలీ బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూడా మోహన్ బాబు కలుస్తారు.
కలవడం కొత్తకాదు.. పిలవడమే కొత్త..
ప్రధాని మోదీని మోహన్ బాబుగానీ, ఆయన కుటుంబీకులు గానీ కలవడం ఇదే తొలిసారి కాదు. మోదీ అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత వివిధ సందర్భాల్లో మోహన్ బాబు ఢిల్లీకి వెళ్లి కలిసోచ్చారు. ఆ చనువుతోపాటు, టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకున్న ఫాలోయింగ్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం.. మంచు లక్ష్మీని స్వచ్ఛభారత్ అభియాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ నియమించింది. మోహన్ బాబుతోపాటు లక్ష్మీ, విష్ణు, మనోజ్ లు పలు సందర్భాల్లో మోదీని, కేంద్ర సర్కారును పొడిగినప్పటికీ.. బీజేపీలో చేరాలని అటువైపు నుంచి పిలుపు రావడం మాత్రం ఇదే తొలిసారి. పైగా మంచు ఫ్యామిలీ అధికారికంగా వైసీపీలో కొనసాగుతున్నవేళ ఇలాంటి ఆహ్వానం రావడం చర్చనీయాంశమైంది.
ఆయనతోనే అన్నీ..
మోదీతో భేటీ తర్వాత మంచు లక్ష్మీ ట్విటర్ లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ.. పార్టీలో చేరే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ‘‘కొద్దిసేపటి కిందటే డైనమిక్ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీని కలిశాం. ఆయన దృష్టిని మనదిగా చేసుకుని స్పష్టంగా చూడగలిగితే.. మనందరం ఆయన మాటల్ని తూచా తప్పకుండా పాటించగలిగితే.. మనం, మన దేశం ఎంతో గొప్ప స్థానంలో ఉండటం ఖాయం''అని లక్ష్మీ రాసుకొచ్చారు.
టీడీపీటు బీజేపీ వయా వైసీపీ
సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానినని చెప్పుకునే మోహన్ బాబు.. తెలుగు దేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్డీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతోనూ కొతకాలం సఖ్యతగా మెలిగారు. 1995 నుంచి 2001 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన.. రెండో సారి అవకాశం దక్కకపోవడంతో హైకమాండ్ పై అలకవహించారు. క్రమంగా రాజకీయాల నుంచి కనుమరుగవుతోన్న టైమ్ లో.. విష్ణు ప్రేమ వివాహంతో మంచు ఫ్యామిలీ.. అప్పటి కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ కు దగ్గరైంది. విష్ణు పెండ్లి చేసుకున్న వెరోనికా రెడ్డి.. వైఎస్ సోదరుడి కూతురు. గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మంచు ఫ్యామిలీ అధికారికంగా వైసీపీలో చేరింది. జగన్ తరఫున వారు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. ఒక దశలో మోహన్ బాబుకుచిత్తూరు జిల్లా నుంచి ఏదో ఒక స్థానంలో టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది.
జగన్ తో చెడిందా?
వైసీపీ భారీ మెజార్టీ సాధించి జగన్ సీఎం అయిన తర్వాత కూడా మోహన్ బాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నారనే వార్తలొచ్చాయి. వాస్తవాలు ఎలా ఉన్నా.. జగన్ తో మోహన్ బాబుకు చెడిందేమోనన్న ఊహాగానాలు అప్పుడప్పుడూ గుప్పుమంటూనే ఉన్నాయి. సోమవారం మోడీతో మంచు ఫ్యామిలీ భేటీ తర్వాత ఊహాగానాలకు దాదాపు తెరపడినట్లైంది. ఫ్యామిలీ మెంబర్సే దూరం కానుండటం జగన్ కు ఒకింత ఇబ్బందికర పరిణామమేనని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. రాజధానుల అంశం రాష్ట్రాన్ని రగుల్చుతున్న వేళ.. ఫ్యామిలీ మెంబర్స్ నే బీజేపీలోకి లాగడ.. జగన్ కు షాకివ్వడం లాంటిదేననీ విశ్లేషిస్తున్నారు. అయితే మంచు ఫ్యామిలీ బీజేపీలో చేరికకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.