వైసీపీకి మోడీ తాజా ఆఫర్ ఇదే- ఇక తేల్చుకోవాల్సింది జగనే- చంద్రబాబు బాట ఎంచుకుంటారా ?
ప్రధానితో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయినప్పుడు దానికి సంబంధించిన కనీస వివరాలను వీరిలో ఎవరో ఒకరు మీడియాకు వెల్లడించడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా మోడీ-జగన్ భేటీకి సంబంధించిన వివరాలు మాత్రం అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మీడియాతో పంచుకోలేదు. దీంతో ఈ భేటీలో కోర్టుల వ్యవహారంతో పాటు కేంద్రంలో వైసీపీ చేరికపై సీరియస్ చర్చే జరిగి ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఏపీలో హైకోర్టు నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వ అధినేత జగన్.. ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్రంలో చేరేందుకు వైసీపీ ఇష్టపడని నేపథ్యంలో ప్రధాని మోడీ తాజాగా మరో ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
మోడీ-జగన్ భేటీలో కీలకాంశాలివేనా ?
ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ నిన్న 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయంలోనే జరిగిన ఈ భేటీలో వీరిద్దరు చర్చించుకున్న అంశాలు మాత్రం బయటికి రాలేదు. దీంతో ఎక్కడ చూసినా ఊహాగానాలే. వైసీపీ వర్గాలు కూడా ఆర్ధికాంశాలు, విభజన హామీలంటూ ఏవో తెలిసీ తెలియని విషయాలను మీడియాకు చెప్పడం కనిపించింది. కానీ వాస్తవానికి రాష్ట్రంలో కోర్టుల నుంచి నిత్యం ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనపై జగన్ ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటున్నాయి, ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్లు చేస్తున్నాయి, దీంతో ప్రభుత్వం ప్రజల్లో ఎలా చులకన అవుతోందన్న అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రధానంగా కేంద్రంలో వైసీపీ చేరే అంశంతో పాటు చంద్రబాబు, లోకేష్పై అమరావతి, ఫైబర్ గ్రిడ్ స్కాంల్లో సీబీఐ దర్యాప్తు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేంద్రంపై వైసీపీ చేరిక మినహా మిగతా రెండు అంశాలు జగన్ అంతకు ముందు హోంమంత్రి అమిత్షాతో మాట్లాడినవే.
చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు..
అమరావతి, ఫైబర్ గ్రిడ్ కుంభకోణాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిందని, దీన్ని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్ధలు నిర్ధారించాయని, వీటి ఆధారంగా తన కేబినెట్ సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసిందని జగన్ ప్రధాని మోడీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రం కూడా తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని జగన్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరామని, అది తెలుసుకున్నాక తదుపరి చర్యలు తీసుకుందామని ప్రధాని మోడీ జగన్కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఆయా అంశాల్లో సీబీఐ దర్యాప్తు కోసం నిరసనలు కూడా చేశారు.
కేంద్రంలో వైసీపీ చేరిక...
కేంద్రంలోకి వైసీపీ చేరిపోతుందనే భారీ ఊహాగానాల మధ్య హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్.. ప్రధానితో మరోసారి దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తాము ఎప్పటినుంచో కోరుతున్న ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీల అమలు లేకుండా కేంద్రంలో చేరితో రాష్ట్రంలో రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, గతంలో టీడీపీ కేంద్రంలో ఉన్నపపుడు ఎదురైన పరిస్ధితులు తనకూ ఎదురవుతాయని జగన్ ప్రధానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రానికి వైసీపీ సహకరిస్తోందని, ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్రంలో చేరాల్సిన అవసరం ఏముందనే కోణంలో జగన్ ప్రధానికి నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాని కూడా జగన్ వాదనతో అంగీకరించినట్లు తెలుస్తోంది.
జగన్కు మోడీ తాజా ఆఫర్...
కేంద్రంలో వైసీపీ చేరికకు జగన్ ఇష్టపడకపోవడం, కేంద్రానికి ప్రతీ అంశంలో మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ గతంలో ప్రతిపాదించిన ఓ ఆఫర్నే మరోసారి తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున ఓ ఎంపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడమే ఆ ఆఫర్. జగన్కు సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్న వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకొమ్మని ప్రధాని మోడీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా జగన్ వెంటనే ఏమీ తేల్చలేదని తెలుస్తోంది. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రధానికి జగన్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు గతంలో చంద్రబాబు కూడా ఎన్డీయేలో చేరకుండా బయటి నుంచి మద్దతిస్తూ లోక్సభ స్పీకర్ పదవిని మాత్రం జీఎంసీ బాలయోగికి తీసుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో జగన్ కూడా డిప్యూటీ స్పీకర్ వరకూ తీసుకుంటారా లేక పూర్తిగా ఎన్డీయేతో దూరంగానే ఉండిపోతారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.