అంతా ఓకేనా?: కేసీఆర్, వైఎస్ జగన్లకు ప్రధాని మోడీ ఫోన్, ఏపీకి అభినందన
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రధాని ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Recommended Video
కేసీఆర్, జగన్లకు ప్రధాని మోడీ ఫోన్, ఏపీకి అభినందనలు
కరోనా తీవ్రత, నివారణ చర్యలు, పరీక్షల వివరాలను ప్రధాని ఆరా తీశారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు పలు కీలక సూచనలు కూడా చేశారు ప్రధాని మోడీ. తెలంగాణ, ఏపీ సీఎంలతోపాటు బీహార్, అస్సాం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా పరిస్థితిపై చర్చించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. అంతేగాక, కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రధాని మోడీ అభినందించారు.
ఏపీలో ఒక్కరోజే భారీగా పెరిగిన కేసులు, మరణాలు
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఏపీలో 5,041 కేసులు నమోదు కావడం గమనార్హం. 56 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,650కు చేరగా, మరణాల సంఖ్య 642కు చేరింది. 26,118 యాక్టివ్ కేసులుండగా, 22,890 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం 1,127 మంది కోలుకున్నారు.
తెలంగాణలోనూ పెరుగుతున్న కేసులు
ఇక తెలంగాణలో ఆదివారం 1,296 కరోనా కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,076కు చేరుకోగా, మరణాల సంఖ్య 415కు చేరింది. 12,223 యాక్టివ్ కేసులున్నాయి. 32,438 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
11 లక్షలు దాటిన కరోనా కేసులు
కాగా, దేశ వ్యాప్తంగా ఆదివారం 37,784 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 21,771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 654 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,15,648కు చేరింది. 3,88,336 యాక్టివ్ కేసులున్నాయి. 6,99,428 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 27,482 మంది మరణించారు.