ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు: కరోనా పోలేదంటూ హెచ్చరిక
న్యూఢిల్లీ/చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తిరుపతికి చెందిన యువకుడు సాయి ప్రణీత్ ప్రశంసలు అందుకున్నారు. సాయి ప్రణీత్ 'ఏపీ వెదర్ మ్యాన్' పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్కీ బాత్ కార్యక్రమంలో సాయి ప్రణీత్ను ప్రధాని ప్రశంసించారు.
రైతులకు ఎంతో ఉపయోకరంగా ఏపీ వెదర్ మ్యాన్ సమాచారం
సోషల్ మీడియా ద్వారా రైతులకు ప్రణీత్ అందిస్తున్న సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. కాగా, సాయి ప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ), ఐక్యరాజ్యసమితి ప్రశంసలు కూడా అందుకున్నాడు.
సాయి ప్రణీత్ సేవలకు ప్రధాని మోడీ ప్రశంసలు
సాయి ప్రణీత్ అందిస్తున్న సేవలను తెలుసుకున్న ప్రధాని మోడీ.. న్కీ బాత్ కార్యక్రమంలో అతని పేరును ప్రస్తావిస్తూ ప్రశంసించారు. కాగా, సాయి ప్రణీత్ గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నారు. ఆకస్మిక వర్షాలు పడతాయని ముందస్తుగా హెచ్చరించడంతో రైతులు తమ తమ పంట ధాన్యాలను భద్రపర్చుకుంటున్నారు. రైతులకు, ఇతర ప్రజలకు ఈ వాతావరణ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతోంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి సంజయ్ రాణా ఉచిత ఛోలే భతూర్..
ఇది ఇలావుండగా, ఫుడ్ స్టాల్ను నిర్వహించే ఛండీగఢ్కు చెందిన 29 ఏళ్ల సంజయ్ రాణాను కూడా ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇతడు సైకిల్పై తిరుగుతూ ఛోలే భతూర్ అనే వంటకాన్ని అమ్ముతుంటాడని మోడీ తెలిపారు. అంతేగాక, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయన ఉచితంగానే దాన్ని అదిస్తూ స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని మోడీ కొనియాడారు. ఇక తమిళనాడులోని నీలగిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మహిళ అమ్బర్క్స్ ప్రాజెక్ట్ చేపట్టిన సేవలందిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. కొండ ప్రాంతాల ప్రజలు ఆస్పత్రులకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను గురించి తెలుసుకుని వారి కోసం ఆమె ఉచితంగా రవాణా సదుపాయాలను కల్పిస్తున్నారని ప్రశంసించారు. తన సహచర ఉద్యోగుల వద్ద విరాళాలు సేకరించి ఆమె ఈ సేవలు కొనసాగిస్తున్నారని మోడీ తెలిపారు. మొత్తం ఆరు అమ్బర్క్స్(ప్రత్యేక ఆటోలు వైద్య సదుపాయం) సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
Recommended Video
కరోనా ఇంకా పోలేదంటూ ప్రధాని హెచ్చరిక
మరోవైపు, దేశంలో కరోనా ఇంకా పోలేదని ప్రజలను అప్రమత్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పండగలు, శుభకార్యాలు జరుపుకునే సమయంలో కరోనా మహమ్మారిని గుర్తు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత లాంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు.