చంద్రబాబుకు దెబ్బపడింది! కేసీఆర్ కూటమి ఉన్న విషయమే తెలియదు: నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ/అమరావతి/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్ - చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మహాకూటమి, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంశాలపై స్పందించారు.
అసలు రైతులు అప్పు ఎందుకు తేవాలి
మధ్య తరగతి వారి కోసమే ముద్ర యోజన, స్టార్టప్ వంటి కార్యక్రమాలు చేపట్టామని నరేంద్ర మోడీ అన్నారు. ఎల్ఈడీ బల్బుల వాడి కరెంట్ బిల్లులు తగ్గించామని చెప్పారు. జీ20 వంటి ప్రపంచ వేదికలపై నల్ల ధనం గురించి చర్చించానని అన్నారు. రుణమాఫీతో రైతుల జీవితాలు మారితే అది సరైనదే అన్నారు. దేవీలాల్ ప్రభుత్వంలో కూడా రుణమాఫీ చేశారని, కానీ ఏం జరిగిందని ప్రశ్నించారు. ఎన్నోసార్లు రైతులకు రుణమాఫీ చేసినా వారి కష్టాలు తీరలేదన్నారు. రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్నారు. అసలు రైతులు అప్పు ఎందుకు తేవాలని, వారు అప్పు చేయకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
కేసీఆర్లాగే మోడీ గెలుస్తారు!: తెలంగాణలో చంద్రబాబు-రాహుల్ కూటమిని లాగిన జైట్లీ
సుప్రీం తీర్పు తర్వాతే ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చాం
దేశంలో తమదే మొదటి కుటుంబం అని చెప్పుకునే వారే బెయిల్ పైన ఉన్నారని నరేంద్ర మోడీ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే తాము ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకు వచ్చామని చెప్పారు. పాకిస్తాన్ సహా చాలా ముస్లీం దేశాలు ట్రిపుల్ తలాక్ను నిషేధించాయని గుర్తు చేశారు. తనను లక్ష్యంగా చేసుకొని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ కూటమి ఉందనే విషయం నాకు తెలియదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన పలు రాష్ట్రాలు తిరిగి, పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. దీనిపై కూడా మోడీ ఇంటర్వ్యూలో స్పందించారు. కేసీఆర్ కూటమి ఒకటి ఉందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘోర పరాజయం పాలయ్యారని చెప్పారు.
చంద్రబాబు-రాహుల్ గాంధీలకు తెలంగాణలో తొలిదెబ్బ
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని చంద్రబాబు, రాహుల్ గాంధీలతో కూడిన మహాకూటమికి తెలంగాణలోనే తొలి దెబ్బ తగిలిందని ప్రధాని మోడీ చెప్పారు. కూటమిని తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. మహాకూటమి సత్తా ఏమిటో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందని కాంగ్రెస్, టీడీపీని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో ఎంత దారుణంగా కూటమి ఓడిందో తెలుసునని, త్రిపుర, జమ్ము కాశ్మీర్లలోను కూటములకు ఇవే ఫలితాలు వచ్చాయని, నేతలు కలిసినంత మాత్రాన ఓటర్లు కలవరని తేలిపోయిందన్నారు. భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించదని చెప్పారు. మహాకూటమి మోడీని గద్దె దింపేందుకు తప్ప, దేశం కోసం కాదని చెప్పారు. 2019 ఎన్నికల నాటికి ఎన్డీయేతో ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో నేను అప్పుడే చెప్పలేనని అన్నారు. ఎన్డీయేలోకి కొత్తగా వచ్చే వారిని ఉద్దేశించి చెప్పారు. వచ్చే ఎన్నికల అజెండాను ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో సుదీర్ఘ పాలన కారణంగా ఓడిపోయామని, తెలంగాణ, మిజోరాంలలో గెలుస్తామని చెప్పలేదన్నారు.
కాంగ్రెస్కు ఆ హక్కు లేదు
వ్యవస్థలను బలహీనపరిచామని చెప్పే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని నరేంద్ర మోడీ అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ వ్యవస్థను గౌరవించిందని ప్రశ్నించారు. ఉర్జీత్ పటేల్ బాగా పని చేశారని చెప్పారు. ఆయన వ్యక్తిగత కారణలతో ఆరు నెలల ముందు నుంచే వైదొలగుతానని చెప్పారన్నారు. రాఫెల్ వ్యవహారంపై పార్లమెంటులో సమాధానం చెప్పానని అన్నారు. 2019లో కూడా ప్రజలు మా వైపే ఉంటారనే విశ్వాసం ఉందని చెప్పారు.