ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి- ప్రధాని మోదీ : అందుబాటులోకి 32 ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ..!!
జవాద్ తుఫాను పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కీలక సూచనలు చేసారు. ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్న జవాద్ తుపాను రెండు రాష్ట్రాల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. తుపాను విరుచుకుపడితే చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని చర్చించారు.ఇప్పటికే బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 32 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించిన కేంద్రం సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీని సిద్ధం చేసింది.
ప్రధాని కీలక సూచనలు
జవాద్ తుఫాన్ ఎఫెక్ట్తో అప్రమత్తమైన తూర్పు కోస్తా రైల్వే మూడు రోజులపాటు పలు రైళ్లను రద్దు చేసింది ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. జవాద్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటినుంచే అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. తుపాన్పై సంబంధిత రాష్ట్రాలు, అధికార యంత్రాంగం సన్నద్ధత గురించి ఆరా తీశారు. విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, ఆరోగ్యం, తాగునీరు వంటి అత్యవసర సర్వీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
సహాయక బృందాలు రంగంలోకి
తుపాన్ వల్ల ఈ సేవల్లో అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని చెప్పారు. సరిపడా అత్యవసర ఔషధాల నిల్వలను సిద్ధంగా ఉంచాలన్నారు. తుపాన్ సహాయక కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ చెప్పారు. జవాద్పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా కూడా అన్ని తీరప్రాంత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఇక, ఏపీ ముఖ్యమంత్రి సైతం వాతావారణ హెచ్చరికలు..ఉత్తారంధ్ర జిల్లాల్లో అప్రమత్తత పైన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Recommended Video
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు
ఓ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూడు జిల్లాలకు ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించారు. కోస్టుగార్డుకు చెందిన హెలికాఫ్టర్లు.. నౌకలను సిద్దం చేసారు. విపత్తు నిర్వహణ స్పందన నుంచి నిధులు విడుదల చేసారు. కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి సమాచారం సేకరిస్తోంది. రాష్ట్రాల అధికారులతో కేంద్రంలోని పలు శాఖల ఉన్నతాధికారులు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఈ సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే లోతట్లు ప్రాంత ప్రజలను శిబిరాలకు తరలింపు ప్రారంభించారు.