రూ.2000నోటుతో ముప్పే: బాబు సంచలనం, ‘దుర్గమ్మ వల్లే ఈ స్థాయికి’
Recommended Video
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్లను దశల వారీగా వెనక్కు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి కీలక సూచన చేశారు. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు.
పెద్దనోట్లతో ముప్పే..
పెద్దనోట్లు కొన్ని సమస్యలకు దారితీస్తాయని మొదట్నుంచీ చెబుతునేఉన్నానని చంద్రబాబు తెలిపారు. వీటితో అవినీతి లావాదేవీలూ పెరిగే ముప్పుందని అన్నారు. ఏ సంస్కరణ అయినా ఫలితాలు చూపేందుకు కాస్త సమయం పడుతుందని ఆయన చెప్పారు.
జీఎస్టీకి బాలారిష్టాలు..
డిజిటల్ కరెన్సీని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని చంద్రబాబు చెప్పారు. జీఎస్టీని బాలారిష్టాలు వెంటాడుతున్నాయని, ఈ విషయంపై జైట్లీతో మాట్లాడానని చంద్రబాబునాయుడు తెలిపారు.
దుర్గమ్మ వల్లే..
బెజవాడ కనకదుర్గను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీరికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగత పలికారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు సీఎం దంపతులు పట్టువస్త్రాలను అందించారు.
శ్రీకృష్ణదేవరాయలు కూడా..
దుర్గమ్మ ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చంద్రబాబు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దుర్గమ్మ ఆశీస్సులతోనే ఎన్నో విజయాలను చేజిక్కుంచుకున్నారని చెప్పారు.రాష్ట్రాభివృద్ధిని కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మూలా నక్షత్రం రోజన అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దుర్గమ్మ ఆలయానికి నిధుల కొరత లేదని, అమ్మవారి ఆశీస్సులతో ఏపీ అభివృద్ధిలో విజయాలు సాధిస్తున్నామని సీఎం అన్నారు. బెజవాడలో దుర్గమ్మ, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి లాంటి రెండు శక్తి పీఠాలు రాష్ట్రంలో ఉండటం అదృష్టమన్నారు. స్వచ్ఛతే సేవ నినాదంతో అమ్మవారి సన్నిధిలో పవిత్ర సంకల్పం చేశానని, రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలని కోరుకున్నానని తెలిపారు. అమరావతి ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని కోరుకున్నానని, నాలెడ్జ్ స్టేట్గా, ఎడ్యుకేషన్హబ్గా ఏపీ రూపుదిద్దుకోవాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు.