రేపు నిజం చెప్పు, విజయసాయితో చాటు వ్యవహారం: మోడీ దుమ్ముదులిపిన మంత్రి
అమరావతి: ఆగస్ట్ 15వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అయినా ప్రధాని నరేంద్ర మోడీ వాస్తవాలు చెప్పాలని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం అన్నారు. మోడీ నాయకత్వం దేశానికి శాపమని మండిపడ్డారు. ఆయన అసమర్థ ప్రధాని అన్నారు. ప్రాంతీయ నాయకత్వాలపై దాడులు చేయిస్తున్నారన్నారు.
ఏడు దశాబ్దాలకాలంలో దేశాన్ని ఎన్నో పార్టీలు, కూటములు పాలించాయని, కానీ హామీలు అమలు చేయడంలో అత్యంత వైఫల్యం చెందడంలో మోడీ మొదటి స్థానంలో నిలుస్తారని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఆయన ప్రసంగాలు విని మెరుగైన పాలన అందిస్తారని భావించి ప్రజలు బీజేపీకి తిరుగులేని మెజార్టీ ఇచ్చారన్నారు. కానీ మోడీ దేశ ప్రజలను అడుగడుగునా వంచించారన్నారు.
లూటీలు చేసిన వారు విదేశాలలో విలాసవంతంగా
ప్రజల ఆశలను మోడీ వమ్ము చేశారని కాల్వ అన్నారు. దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారన్నారు. మోడీ పాలనలో వేల కోట్లు సొమ్ము దోపిడీ చేసి, బ్యాంకులను లూటీ చేసిన వారు విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. ప్రతి పౌరుడిని దారుణంగా వెన్నుపోటు పొడిచి, నయవంచనకు గురి చేసి, నమ్మక ద్రోహం చేశారన్నారు.
మోడీ దేశానికి శాపం
బీజేపీ ఇచ్చిన ఎన్నో హామీల్లో 34 మాత్రమే అమలు చేశారని చెప్పారు. ముందు చూపులేకుండా నిరంకుశమైన విధానాలు అనుసరించడం వల్ల దేశానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. మోడీ నాయకత్వం దేశానికి శాపమని, మీడియా హౌస్ పేరుతో జర్నలిస్టులు విడుదల చేసిన పుస్తకం ద్వారా మోడీ పాలనలోని ప్రగతి తిరోగమనంలో ఉన్నట్లు స్పష్టమైందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. జీడీపీ పెరగలేదన్నారు.
వారికే బీజేపీ రక్షణ
గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయన్నారు. మోడీ ఆర్థిక విధానాలు ప్రధానంగా నోట్ల రద్దు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఈ రద్దు వల్ల సామాన్యుడు వీధులపాలయ్యాడన్నారు. బ్యాంకింగ్ రంగంపై నమ్మకం పోయేలా చేసిందన్నారు. మాల్యా, లలిత్, నీరవ్ల వంటి వారు వేల కోట్లు బ్యాంకుల నుంచి దోచి, విదేశాల్లో తిరుగుతున్నారన్నారు. స్కాంలు చేసిన వారికి బీజేపీ రక్షణగా ఉందన్నారు.
విజయసాయి రెడ్డి వంటి వారు చాటుమాటు వ్యవహారాలు
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వంటి వారు ప్రధాని కార్యాలయంలో చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్నారని కాల్వ ఆరోపించారు. తప్పు చేసిన వారికి పీఎంఓ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతోందన్నారు. దేశాన్ని ఎక్కడకు తీసుకెళుతున్నారని మండిపడ్డారు. దేశంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. బ్లాక్ మనీ ఏమయిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఖాతాలో బ్లాక్ మనీ వేశారా అని సెటైర్ వేశారు.
దేశాన్ని అప్పులపాలు చేశారు
2013-14లో దేశం అప్పులు రూ.56.69 లక్షల కోట్ల కాగా ఇప్పుడు రూ.79.62 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మోడీది ప్రచార ఆర్భాటమే తప్ప ఏమీ లేదన్నారు. రాజకీయంగా ఆలోచిస్తే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తున్నారన్నారు. ఏపీలో కూడా కొంతమందికి పదవులు ఇచ్చి రాజకీయాలను కలుషితం చేస్తున్నారని జీవీఎల్ నర్సింహా రావును ఉద్దేశించి అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని, నిజాలు చెప్పాలన్నారు.