మోడీ హత్యకు కుట్ర?: టెర్రరిస్టులకు ఆంధ్ర లింక్, 22 మంది టార్గెట్
ప్రధాని మోడీతో పాటు 22 మంది రాజకీయ నాయకులను లక్ష్యం చేసుకుని దాడులు చేసేందుకు కుట్ర చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఉగ్రవాదులకు ఆంధ్ర లింక్ కూడా ఉంది.
చెన్నై: పేలుళ్ల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. తమిళనాడులోని మదురైలో ముగ్గురు అల్ ఖైదా సానుభూతి పరులైన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. మోడీతో పాటు మరో 22 ందని రాజకీయ నాయకులను వారు లక్ష్యంగా ఎంచుకున్నట్లు తేలింది.
ఉగ్రవాదుల నాయకుడు హకీం చివరిక్షణంలో ఎన్ఐఏ వల నుంచి తప్పించుకున్నాడు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరంతా ప్రధానితోపాటు 22 మంది నేతలను, పలు దేశాల దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని బాంబు పేలుళ్లకు పాల్పడాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ముగ్గురిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.
ఆదివారం రాత్రి మదురైకి చెందిన ఎన.అబ్బాస్ అలీ(27), టి.అయూబ్ ఖాన్(26), అబ్దుల్ కరీంలను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పెయింటర్గా పని చేస్తున్న అబ్బాస్ అలీ ఇటీవలే నేలపేటలో ఇస్లాం మత గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని తెరిచాడు. అబ్దుల్ కరీం కాట్రపాలయంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు.
అయూబ్ఖాన్కు ఇటీవలే వివాహమైంది. విచారణలో వారు అందించిన సమాచారం ప్రకారం చెన్నైలోని ఓ ఐటీ సంస్థలో సిస్టమ్ అనలిస్ట్గా పనిచేస్తున్న దావూద్ సులేమాన్ను పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులో తీసుకున్నారు. స్థానిక తిరువాన్మియూరులో అద్దె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సులేమాన్ను ఎన్ఐఏ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.
మదురై జిల్లాలో ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారనే విషయం తెలిసిన తర్వాతనే సులేమాన్ ఆదివారం రాత్రి మధురై నుంచి బస్సులో చెన్నై వచ్చాడు. ఎన్ఐఏ అధికారులు అప్రమత్తం కావడంతో పట్టుబడ్డాడు. నలుగురిలో అయూబ్ఖాన్ పాత్ర ఇంకా నిర్ధారణ కాలేదు.
నలుగురికీ ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కేరళలోని కొల్లం, మళప్పురం, కర్ణాటకలోని మైసూరు కోర్టుల్లో జరిగిన బాంబు పేలుళ్లతో సంబంధం ఉంది. నలుగురి వద్దా భారీగా పేలుడు పదార్థాలు, కొంత నగదు, సెల్ఫోన్లు లభించాయి.
నెల్లూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు సందర్భంగా 'ది ఫేస్ ఆర్గనైజేషన్' పేరుతో కరపత్రాలు లభ్యమయ్యాయి. అందులో 'ద బేస్ మూమెంట్' అని పేర్కొన్నారు. అల్ ఖైదా అర్థం కూడా అదే. వాటి ఆధారంగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ తీవ్రవాదుల వేటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు కూడా సహకరించారు.