బాబుకు షాక్: అమరావతి వేడుకకు ప్రధాని మోడీ దూరంగా ఉండటం మేలు!
విశాఖ/ఢిల్లీ: విజయదశమి (అక్టోబర్ 22) నాడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రదాని నరేంద్ర మోడీ రానున్నారు. అయితే, ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపన వేడుకకు రాకపోవడమే ఉత్తమం అని పలువురు అంటున్నారని తెలుస్తోంది.
సమాచారం మేరకు... దసరా రోజు జరిగే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకకు ప్రధాని మోడీ దూరంగా ఉండటం మేలని మాజీ యూనియన్ ఎనర్జీ సెక్రటరీ చెప్పారని వార్తలు వస్తున్నాయి. సోమవారం నాటి ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
రాజధాని అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని ఆయన చెప్పారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ రాజధాని వేడుకకు దూరంగా ఉండటమే ఉత్తమమని ఆయన సూచించారని తెలుస్తోంది.
అంతేకాదు, ఈ విషయమై తాను ప్రధాని మోడీకి లేఖ రాశానని కూడా ఆయన చెప్పారు. అమరావతి ప్రాజెక్టు కేవలం రియాల్టర్లకు మాత్రమే ఉపయోగపడుతుందని, దీని వల్ల కనీసం విజయవాడ - గుంటూరు ప్రజలకు కూడా ఏం ఉపయోగముండదని ఆయన లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది.
మన మట్టి-మన నీరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో నిర్వహించిన మన మట్టి - మన నీరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం స్వగ్రామంలో పుట్టమట్టి సేకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమరావతి విజయవంతం కావాలని నారావారిపల్లెలో సీఎం పూజలు నిర్వహించారు.