తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ,రాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు...
భోగి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను.' అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తెలుగులోనే ట్వీట్ చేయడం విశేషం.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 'దేశ పౌరులందరికీ లోహ్రి,మకర సంక్రాంతి,పొంగల్,భోగాలి బిహు,ఉత్తరాయణ్,పౌష్ పర్వ శుభాకాంక్షలు. ఈ పండుగలు మన సమాజంలో ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడాలి. దేశంలో భోగభాగ్యాలను,సుఖసంతోషాలను పెంపొందించాలి.' అని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగలో మొదటి పర్వదినం భోగి. భోగి అనగానే చాలామందికి ఇళ్ల ముందు మంటలు,చిన్నారులకు భోగి పళ్లు గుర్తుకొస్తాయి.భోగి రోజున ఇంటి వాకిలిలో మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని చాలామంది హిందువులు విశ్వసిస్తారు. ఇక భోగి పండ్ల విషయానికొస్తే.. రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం కూడా. వీటిని తలపై పోయడం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పిల్లలపై ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి కూడా తొలగిపోతుందని భావిస్తారు.
దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత.
Bhogi greetings to everyone. I pray that this special day fills everyone’s lives with happiness and good health.
— Narendra Modi (@narendramodi) January 13, 2021
అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను.