అంబులెన్స్లపై సరికొత్త వాదన..వివాదం: మోడీ బొమ్మ ఉండాల్సిందే: ఆ ఘనత మాదే: బీజేపీ ఎమ్మెల్సీ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్స్ వాహనాలపై సరికొత్త వాదన.. వివాదం తలెత్తింది. భారతీయ జనతా పార్టీ ఈ వాదనను వినిపిస్తోంది. రాష్ట్రంలో అంబులెన్స్లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 70 శాతం మేర నిధులను కేటాయించిందని చెబుతోంది బీజేపీ. అంబులెన్స్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర.. వాటా నామమాత్రమేనని స్పష్టం చేస్తోంది.
ఈ నెల 1వ తేదీన డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 108, 104 అంబులెన్స్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఒకేసారి 1088 సరికొత్త అంబులెన్స్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యధునికమైన వైద్య సదుపాయాలు, సిబ్బందితో వాటిని రూపొందించారు. వెంటిలేటర్ సహా ఐసీయూ తరహా వైద్యాన్ని అంబులెన్స్ల ద్వారా అందించే ఏర్పాటును చేసింది జగన్ ప్రభుత్వం.
కడపకు మరో వరమిచ్చిన వైఎస్ కుటుంబం- ఎయిర్ పోర్టులో నైట్ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్...
దీనికోసం 200 కోట్ల రూపాయలకుపై గా నిధులను వ్యయం చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా మొత్తమే 70 శాతం మేర ఉంటోందని చెబుతున్నారు బీజేపీ నాయకులు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని మండిపడుతోంది. కేంద్రం ఇచ్చిన నిధుల మొత్తమే అధికంగా ఉన్నందు వల్ల ప్రతి అంబులెన్స్ వాహనంపైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను అతికించాలని బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ లేకుండా అంబులెన్స్లను నడిపించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలను ఏ కారణంతో అంబులెన్స్లపై అతికించారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రచార పిచ్చి పట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వాడుకుంటూ తాను రాజకీయంగా లబ్ది పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Recommended Video
104, 108 వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు ఇస్తుందనే విషయాన్ని రాష్ట్రం దాచి పెట్టిందని మండిపడ్డారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనులనే వైఎస్ జగన్ చేస్తున్నారు అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం మోడీ పథకాలకు స్టిక్కర్లు అతికించి తమవిగా ప్రచారం చేసుకుందని, ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారని అన్నారు.