టీడీపీ-వైసీపీ ఏమైనా చేసుకోనివ్వండి: కొత్తపల్లి గీతతో మోడీ ఇలా.., 'జగన్ పార్టీని మూసేస్తారా'
న్యూఢిల్లీ: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఏడాది కూడా ఎక్కువ నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీని కోరినట్లు బుధవారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించానన్నారు.
నరేంద్ర మోడీ నాతో చెప్పారు
విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరినట్లు కొత్తపల్లి గీత తెలిపారు. ఏపీ ప్రజలకు పూర్తి న్యాయం చేస్తానని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని మోడీ తనతో చెప్పారన్నారు.
టీడీపీ, వైసీపీలు ఎవరు ఏం చేసినా
విభజన గాయాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని తాను కోరినట్లు తెలిపారు. ఏపీకి మేలు చేయాలనే మేం ఉన్నామని, టీడీపీ, వైసీపీలు రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నాయని, ఎవరు ఎలా చేసినా మేం మాత్రం ఏపీకి న్యాయం చేస్తామని మోడీ చెప్పారని కొత్తపల్లి గీత అన్నారు.
చంద్రబాబు బినామీ పత్తిపాటి
ఇదిలా ఉండగా, మంత్రి పత్తిపాటి పుల్లారావు సీఎం చంద్రబాబు నాయుడుకి బినామీగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత వైయస్ జగన్ విమర్శించారు. గత ప్రభుత్వం పేదలకు భూములిస్తే వాటిని లాక్కొని మంత్రి పత్తిపాటి మైనింగ్కు వాడుకుంటున్నారని, ఇసుకను అమ్ముకుంటున్నారన్నారు. వచ్చిన సొమ్మును పుల్లారావు, మంత్రి లోకేష్ పంచుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి ఆ భూములను తక్కువ రేటుకు కొనుక్కుంటున్నారన్నారు.
జగన్కు సవాల్
దీనిపై పత్తిపాటి గురువాలం సవాల్ విసిరారు. తనపై జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని, వాటిని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే జగన్ వైసీపీని మూసుకుంటారా అన్నారు. అలాగే, జర్నలిస్టులను హత్యలు చేయించే సంస్కృతి తనది కాదని చెప్పారు.