వేలల్లో కేసులు పెరుగుతోన్న వేళ.. వైఎస్ జగన్ సహా: ముఖ్యమంత్రులతో ప్రధాని: ఏం చెబుతారు?
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా అయిదు రోజుల పాటు 10 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే రాష్ట్రంలో దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరణాల సంఖ్య అంతే భీతావహంగా పెరుగుతోంది. సోమవారం అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఇప్పటిదాకా రాష్ట్రంలో 2,116 మంది కరోనా బారిన పడి మరణించారు. మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,35,525కు చేరుకున్నాయి.
వైట్హౌస్ వద్ద భయానకం: బుల్లెట్ల వర్షం: ప్రెస్మీట్ నుంచి అర్ధాంతరంగా ట్రంప్ వెనక్కి
మొదట్లో అదుపులో ఉన్న కరోనా వైరస్.. క్రమంగా విస్తరించింది. రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. వందల సంఖ్యలో నమోదవుతూ వచ్చిన రోజువారీ పాజిటివ్ కేసులు.. వేలకు చేరుకున్నాయి. ఆ సంఖ్య కూడా పది వేలను దాటుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. అధికార యంత్రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిణామాలపై దృష్టి సారించింది. కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలపై ఆరా తీస్తోంది.
ఈ క్రమంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ సహా తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొద్దిసేపట్లో భేటీ కానున్నారు. ఈ తొమ్మిది రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్నవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ, తెలంగాణ సహా బిహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
Recommended Video
ఈ సమావేశంలో మోడీతో పాటు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్, హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అరికట్టడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై ప్రధానమంత్రి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తారు. కేసులు పెరగడానికి గల కారణాలపై ఆరా తీస్తారు. కేంద్రం నుంచి అందించే సహాయ, సహకారాలు, ప్రత్యేక బృందాలతో సమీక్షించడం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తాయని తెలుస్తోంది.