తెలుగురాష్ట్రాల్లో కొత్త ప్రయోగం .. కొబ్బరిపీచుతో గ్రామీణ రోడ్ల నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో నిర్మించే రోడ్ల విషయంలో ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్లలో జౌళి, కొబ్బరిపీచు తో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానంలో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. అంతేకాకుండా తక్కువ వ్యయంతో, ఎక్కువ కాలం బాగుండే రోడ్ల నిర్మాణం చెయ్యొచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
Recommended Video
విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ సాధ్యమేనా ? ఆన్ లైన్ బోధన గ్రామాల్లో వర్కవుట్ అవుతుందా ?
కాయిర్ జియో టెక్స్టైల్స్ ద్వారా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్ల నిర్మాణం
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో జౌళి, కొబ్బరిపీచును ఉపయోగించి కాయిర్ జియో టెక్స్టైల్స్ ద్వారా నిర్మాణం చేస్తామని ఒక ప్రకటన చేసింది కేంద్రం . దీనికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏజెన్సీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది .ఇక ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్లో 164 కిలోమీటర్లు, తెలంగాణలో 121 కి.మీ లు నిర్మాణం చేపట్టనున్నారు.
పర్యావరణ హాని లేకుండా తక్కువ వ్యయంతో మన్నికైన రోడ్లు
ఈ కొత్త విధానంలో పర్యావరణానికి అనుకూలంగా, తక్కువ వ్యయంతో మన్నికైన రోడ్లను నిర్మించవచ్చని అంచనా వేసింది కేంద్రం . ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానంలో రోడ్లను వేసి వాటి సామర్ధ్యాన్ని పరీక్షిస్తున్నారు. గతంలో కర్ణాటక, కేరళ, తమిళనాడులో సమర్థవంతంగా కొబ్బరి పీచును ఉపయోగించి రోడ్లను నిర్మించారు. అక్కడ రోడ్లు, కాలువల నిర్మాణంలో జియోటెక్స్టైల్ ఉపయోగించి సక్సెస్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో కాయర్ జియోటెక్స్టైల్స్ టెక్నాలజీతో రోడ్లు
ఇక దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 1,674 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణంలో కొబ్బరి పీచు, జౌళిని ఉపయోగించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలతో పాటు కేరళలో 71, మహారాష్ట్రలో 328, గుజరాత్లో 151, ఒడిశాలో 470, తమిళనాడులో 369 కిలోమీటర్ల రహదారిని కాయిర్ జియో టెక్స్టైల్స్ ఉపయోగించి నిర్మించనున్నారు . ఇందుకోసం ఒక కోటి చదరపు మీటర్ల కాయిర్ జియో టెక్స్టైల్స్ అవసరమని, ఇందుకు రూ. 70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు .
కొబ్బరిపీచుతో రోడ్ల నిర్మాణంపై మంత్రి నితిన్ గడ్కరీ హర్షం
కొబ్బరిపీచు, జౌళి వినియోగంతో రోడ్ల వేడి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రోడ్లు త్వరగా గుంటలు పడవు గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కొబ్బరి పీచును ప్రత్యామ్నాయంగా వాడేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో మంత్రి నితిన్ గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విషయంలో స్పందించిన నితిన్ గడ్కరీ రోడ్ల నిర్మాణంలో కాయిర్ జియో టెక్స్టైల్స్ వాడడంలో మనం ఇప్పుడు విజయం సాధించామని పేర్కొన్నారు . ఇక కరోనా వైరస్ వల్ల దెబ్బ తిన్న జౌళి పరిశ్రమకు ఈ నిర్ణయం ప్రాణం పోస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.