ట్విస్ట్: ఆయేషా హత్యకేసు వివరాలను కోరిన పిఎంఓ, హంతకులెవరు?
ఆయేషా మీరా హత్యకేసులో పిఎంఓ స్పందించింది. ఆయేషా మీరా తల్లిదండ్రులు పిఎంఓ కు రాసిన లేఖకు పిఎంఓ నుండి సమాధానం అందింది.
విజయవాడ: ఆయేషా మీరా హత్యకేసులో పిఎంఓ స్పందించింది. ఆయేషా మీరా తల్లిదండ్రులు పిఎంఓ కు రాసిన లేఖకు పిఎంఓ నుండి సమాధానం అందింది.ఈ కేసును సంబంధించిన వివరాలను పంపాలంటూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దినేష్ కుమార్ ను ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించింది.
పిఎంఓ ఆదేశాలతో మరోసారి ఆయేషా మీరా కేసు వార్తల్లోకెక్కింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబును నిర్ధోషిగా గుర్తించి హైకోర్టు ఇటీవలనే ఆయనను విడుదల చేసింది.
ఆయోషామీరా హత్యకేసులో కొందరు రాజకీయనాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయమై ఆయేషా మీరా తల్లిదండ్రులు పిఎంఓకు లేఖరాయడంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకెక్కింది.
తన కూతురు హత్యకు సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఆయేషామీరా తల్లిదండ్రులు చెబుతూనే ఉన్నారు.అయితే రాజకీయఒత్తిళ్ళ కారణంగానే ఈ కేసులో సత్యంబాబును ఇరికించారని వారు ఆరోపించారు.ఈ కేసును పునర్విచారణ చేయించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆయేషా ను హత్య చేసిందేవరు?
2007 డిసెంబర్ 26వ, తేదిన విజయవాడలోని దుర్గాహస్టల్ లో ఆయేషా మీరా అనుమానాస్పదస్థితిలో మరణించింది.ఈ మరణం వెనుక వ్యక్తులు ఎవరనే విషయం ఇంకా అనుమానాలు రేకెత్తిస్తోంది.ఈ కేసు రాజకీయరంగు పులుముకొంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.అయితే ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాలని టిడిపి ఆందోళన చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంది.ఈ కేసును తిరిగి పునర్విచారణ చేయాలని ఆయేషా తల్లిదండ్రులు చంద్రబాబునాయుడును కోరారు.ఈ మేరకు బాబు కూడ హామీ ఇచ్చారు. మరో వైపు ఈ కేసులో దోషిగా ఆరోపణలు ఎదుర్కోన్ని సుమారు 8 ఏళ్ళపాటు జైళ్ళలో ఉన్న సత్యంబాబును కోర్టు నిర్ధోషిగా ఇటీవలనే విడుదల చేసింది.దీంతో అసలు దోషులెవరనే చర్చ మళ్ళీ ప్రారంభమైంది.అయితే ఆయేషా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నట్టుగా రాజకీయనేత కుటుంబానికి ఈ హత్యతో సంబంధాలున్నాయనే చర్చ కూడ లేకపోలేదు.అయితే విచారణలో ఈ విషయాలన్నీ వెలుగుచూసే అవకాశం ఉంది.
కేసు వివరాలను పంపాలన్న పిఎంఓ
ఆయేషా మీరా హత్యకేసు పూర్తివివరాలను పంపాలని ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్ కుమార్ ను ఆదేశించింది. ఈ విషయమై ఆయేషాతల్లిదండ్రులు పిఎంఓకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఎంపిఓ కేసు వివరాలను పంపాలని కోరడంతో ప్రాధాన్యత సంతరించుకొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఈ కేసు పునర్విచారణకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు ఇవ్వడం ఇదే తరుణంలో ఈ కేసు పూర్తి వివరాలను పిఎంఓ కోరడంతో కేసులో మరోసారి కదలిక వచ్చేలా కన్పిస్తోంది.
పోలీసులపై అనుమానాలు?
ఆయేషా మీరా హత్యకేసులో సత్యంబాబు నిర్ధోషిగా హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.అయితే ఈ తీర్పు సందర్భంగా పోలీసులపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. నిర్ధోషి అయిన సత్యంబాబును ఈ కేసులో ఇరింకించారని అభిప్రాయపడింది.అయితే ఈ కేసును విచారించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే నిర్ధోషిగా ఉన్న సత్యంబాబును ఈ కేసులో ఇరికించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చిందనే ప్రశ్నను ఆయేషా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ ఒత్తిడుల కారణంగానే సత్యంబాబును ఈ కేసులో ఇరికించారని ఆయేషా తల్లిదండ్రులు నాటినుండి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును విచారించిన పోలీసులకు వాస్తవాలు తెలుసుననే అభిప్రాయాలను ఆయేషా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
రూమ్మేట్స్ పైనా అనుమానాలు
ఆయేషా రూమ్మేట్స్ ఇద్దరితో పాటు ఓ రాజకీయనాయకుడి కుటుంబానికి చెందిన వ్యక్తి హస్టల్ వార్డెన్ కు ఈ కేసుతో సంబంధాలున్నాయనే ఆయేషా తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఆయేషా రూమ్మేట్స్ ను విచారిస్తే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.అయితే ఈ ఘటన జరిగి పదేళ్ళు దాటింది.ఈ కేసులో ఆయేషా మేనమామ, తర్వాత వంటమనిషిని అనుమానించారు.అయితే వారెవరూ కూడ ఈ హత్య చేయలేదని పోలీసులు నిర్దారించారు.చివరకు సత్యంబాబును దోషిగా తేల్చి అరెస్టు చేశారు.అయితే చివరకు సత్యంబాబుకు కూడ ఈ కేసుతో సంబంధం లేదని తేలడంతో ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది.