విశాఖ సముద్రం ఒడ్డుకు విషపూరిత చేపలు...కాపాడిన స్థానికులు
విశాఖపట్టణం: సముద్ర జీవులు మృత కళేబరాలుగా మారి ఒడ్డుకు కొట్టుకు రావడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంతులేని అగాధమైన సముద్ర గర్భంలో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో సముద్రంలో జరిగే మార్పుల గురించి సైటింస్టులు కూడా విశ్లేషించలేని స్థితిగతులు ఉంటాయి.
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే విశాఖపట్టణంలో భారీ సంఖ్యలో రెండు రకాల జలచరాలు పెద్ద సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇందులో ఒకటి విషపూరితమైన చేప కాగా మరొకటి భారీ పరిమాణంలో ఉండే తాబేలు. అయితే విషపూరితమైన చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చినప్పడు కూడా జీవించే ఉండగా, తాబేళ్ల మృత కళేబరాలు కొట్టుకువచ్చాయి.
విశాఖలో ఎక్కడ...
విశాఖపట్టణం సమీపంలోని గుడ్లవానిపాలెం ప్రాంతంలో సముద్ర తీరానికి ప్రాణాలతో ఉన్న వివిధ రకాల ముళ్లగప్పలు శనివారం ఉదయం భారీ సంఖ్యలో కొట్టుకు వచ్చాయి. వందలాదిగా ఉన్న ఈ వింత చేపలను చూసేందుకు బీచ్ ఒడ్డున వ్యాయామం చేస్తున్న జనాలతో పాటు చట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. అయితే ఒడ్డుకు కొట్టుకు వచ్చినపుడు బతికే ఉన్న ఈ చేపలు కాసేపటికి చనిపోతుండటంతో అప్రమప్తమైన స్థానికులు వీటిని జాగ్రత్తగా నీటిలోకి నెట్టివేశారు.
విషపూరితమైన చేపలు...
అయితే ఈ చేపలను సముద్రంలోకి నెట్టేసే క్రమంలో కొందరిపై వీటి విషం ప్రభావం చూపడంతో నొప్పితో విలవిల్లాడిపోయారు. ముళ్లగప్పలుగా వ్యవహరించే ఈ చేపలు సాధారణంగా ప్రాణాంతకం కాకపోయినా వీటి విషం ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశాఖ మత్స్యశాఖాధికారిణి జి.విజయ తెలిపారు. అయితే వీటి విషప్రభావం బారిన పడి వెంటనే చికిత్స అందనివారు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుందని అన్నారు.
ముళ్లగప్పల శరీర నిర్మాణం....
చూసేందుకు ఈ ముళ్లగప్పలు వింతగా ఉండటంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో సముద్రతీరానికి చేరుకున్నారు. ఈ ముళ్లకప్పలకు ముఖభాగంతో పాటు మిగిలిన శరీరమంతా ముళ్లు ఉంటాయి. అవి శరీరానికి గుచ్చుకుంటే సుమారు 3 గంటలకు పైగా నొప్పితో బాధ పడాల్సిందేనని, తక్షణమే వైద్యం చేయించుకోవాలని విశాఖ మత్స్యశాఖాధికారిణి జి.విజయ పేర్కొన్నారు. ప్రమాదకరమని తెలిసినా మానవతా దృక్పథంతో ఈ ముళ్లకప్పలను రక్షించిన వ్యాయామం చేసేవారిని, స్థానికులను ఆమె ప్రశంసించారు.
తాబేళ్ల మృత్యువాత...
అయితే ఈ సాగర్నగర్తో పాటు గుడ్లవానిపాలెం, సమీప ప్రాంతాల తీరానికి గతకొద్ది రోజులుగా సముద్రపు తాబేళ్ల మృతకళేబరాలు పెద్ద సంఖ్యలో కొట్టుకువస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విధంగా ముసలయ్యపాలెం తీరం నుంచి రుషికొండ బీచ్ మధ్యలో సుమారు 3 కి.మీ మేర ఇటీవలి కాలంలో వందలాది తాబేళ్ల మృత కళేబరాలు కొట్టుకువస్తున్నట్లు వారు తెలిపారు.
స్థానికుల ఆందోళన...
అయితే విశాఖ సముద్రతీరంలో ఈ ప్రాంతానికే ఈ విధంగా పెద్ద సంఖ్యలో తాబేళ్ల మృత కళేబరాలు కొట్టుకురావడం, అదే క్రమంలో మళ్లీ ఈ ముళ్లగప్పలు కొట్టుకు రావడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితేనే ఈ విధంగా జరుగుతుదని వారు అంటున్నారు. ఇటీవలి కాలంలో విశాఖలోనే కొన్ని తీరాల వద్ద సముద్రం బాగా ముందుకు చొచ్చుకువచ్చిందని, ఇవన్నీ సముద్రంలో ఏదో జరుగుతుందనడానికి నిదర్శనమని మరికొందరు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం అవన్నీ కేవలం అపోహలేనని, సముద్ర తీరంలో ఇటువంటి పరిణామాలు సాధారణమేనని స్పష్టం చేశారు. అయితే సముద్రంలోకి విడుదలవుతున్న కాలుష్యకారకాల వల్ల, లేక అక్రమంగా ఏర్పాటు చేస్తున్న భారీ చేపల వలల వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంటాయని అంటున్నారు.