డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తి.. ఏపీ ప్రభుత్వంపైనే ఉంది: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 డిసెంబర్నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ చెప్పారు. ఇప్పటికే 69శాతం పూర్తయ్యిందని ఆమేరకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలిపిందని లోక్సభలో చెప్పారు. టీడీపీ ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికల్లా 69శాతం ప్రాజెక్టు పనులు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రూ.8614.16 కోట్లు కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించనుంది
2014 నుంచి రాష్ట్రప్రభుత్వం ఏమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిందో ఆ డబ్బులు మొత్తం పైసాతో సహా చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన మొత్తం రూ.8614.16 కోట్లు కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించనుంది. ఈ మొత్తానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరియు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపాయి. అంతేకాదు గత నెలలో విడుదల చేసిన రూ. 1850 కోట్లు కూడా ఇందులోకే వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుపుతూ ఆడిట్ వివరాలను కేంద్రంకు సబ్మిట్ చేయాలని కోరినట్లు మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ చెప్పారు. ఈ మేరకు రెండు సార్లు లేఖలు కూడా రాసినట్లు ఆయన వెల్లడించారు. ఇక 2013 - 14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు కూడా తెలపాలని కోరినట్లు మంత్రి సమాధానంగా చెప్పారు.
ఆర్థికశాఖ రాష్ట్రానికి మరో లేఖ రాసిందని మంత్రి గజేందర్ షెకావత్
2018 జూలై 26న, 2019 మే 6న రాసిన రెండు లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని మంత్రి చెప్పారు. ఆడిట్కు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రంకు సమర్పించే వరకు ఎలాంటి నిధులు విడుదల చేయబోమని తెలుపుతూ గతేడాది నవంబర్ 26వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రానికి మరో లేఖ రాసిందని మంత్రి గజేందర్ షెకావత్ తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది మే 7న రివైజ్డ్ కాస్ట్ కమిటీకి కూడా కేంద్ర జలసంఘం లేఖ రాసిందని చెప్పారు. 2013-14కు గాను సవరించిన ధరల ప్రకారం రూ.54,446.1 కోట్లుగా అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చిన వివరాల ప్రకారం తాత్కాలికంగా రూ. 5175.25 కోట్లకు గాను రూ.3777.44 కోట్ల వరకు ఆడిట్ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు.
2021 డిసెంబర్ నాటికి
ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన నిధులు విడుదల చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు మంత్రి షెకావత్. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి సమాధానం ఇచ్చారు.