టైం సరిపోదు.. గ్రావిటీ ద్వారా 2019లోనే పోలవరం నీరు: పొలిటికల్ లబ్ది కోసం బాబు ఎమోషనల్ వ్యూహం
హైదరాబాద్/ అమరావతి: గోదావరి నదిపై నిర్మిస్తున్న 'పోలవరం' ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ వాసులకు వర ప్రదాయిని అన్న సంగతేమో గానీ, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నదా? దీన్ని అధినేతలకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు నిర్మిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ టాయ్ సంస్థ ఆధ్వర్యంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నాయి.
కానీ ఆధిపత్యం కాపాడుకునేందుకు కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్టాయ్ అధినేత రాయపాటి సాంబశివరావు చేస్తున్న ప్రయత్నాలు ముగియడంతోపాటు ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ప్రత్యేక టెండర్లు పిలువొచ్చని ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చేసింది. సోమవారం పనులు ప్రారంభించినా.. కేవలం 150 రోజుల్లోనే కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తిచేసి, గ్రావిటీపై నీటిని విడుదల చేయడం కుదిరే పని కాదని ఇంజినీర్లు తేల్చి చెప్తున్నారు.
భావోద్వేగంతో లబ్దికి ఇలా చంద్రబాబు ప్లాన్
కానీ మూడున్నరేళ్లు కాలక్షేపం చేసి.. విలువైన సమయాన్ని వ్రుథా చేసి.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ‘పోలవరం' నా జీవిత కాల ధ్యేయం అని భావోద్వేగ ప్రకటనలు చేసి ఆంధ్రుల మనస్సు మరోసారి చూరగొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వచ్చే జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందించాలని ఇంతకుముందు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకునే సంకేతాలు కనిపించడం లేదు. సోమవారం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు స్వయంగా ఈ విషయం కుండబద్దలు కొట్టారు. పోలవరం ప్రాజెక్టులో పనులన్నీ పూర్తిచేసి 2018 జూన్ నాటికి తొలిదశగా గ్రావిటీ ద్వారా నీళ్లు సరఫరా చేసే ప్రణాళిక ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణయోగ్యంగా కనిపించడం లేదు.
నీళ్లివ్వలేనని అంగీకరించిన ఏపీ సీఎం చంద్రబాబు
మూడు నెలలుగా అనేక పనులు అపరిష్కృతంగా ఉండిపోవడం.. జూన్ వరకు కేవలం 150 పని రోజులు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ఇది దాదాపు అసాధ్యమే. సీఎం చంద్రబాబు సైతం పోలవరంలో సోమవారం మాట్లాడుతూ సూచాయగా ఈ సంగతి అంగీకరించారు. 2018కి గ్రావిటీ ద్వారా నీటి సరఫరా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనన్నారు. తమవంతు గట్టి ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. ‘వివిధ సాంకేతిక కారణాల వల్ల, కేంద్ర సంస్థలు కొన్ని సాంకేతిక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు మూడు నెలల సమయం పట్టింది. గోదావరిలో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ప్రవాహమే లేదు. అందువల్ల పనులు చేసేందుకు మంచి అవకాశం వచ్చింది. అలాంటి కీలక పనిదినాలు కోల్పోయాం. ఇప్పటికీ 2018 జూన్ నాటికి నీళ్లు ఇవ్వాలనే గట్టి పట్టుదలతోనే ప్రయత్నిస్తాం. ఎంతవరకు వీలవుతుందో చెప్పలేం' అని జలవనరులశాఖ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. కానీ అధికార టీడీపీ పూర్తి చేయాల్సిన పని చేయకుండా.. ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని దుష్ప్రచారం చేపట్టింది.
100ఏళ్ల కోసారి వచ్చే వరద తట్టుకునే సామర్థ్యం కావాలి
దిగువ కాఫర్ డ్యాంలో ఇప్పటికే జెట్ గ్రౌటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. 65వేల చదరపు మీటర్ల పనిచేయాలి. ఇందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పడుతుంది. ఆ పైన దాదాపు 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేయాలి. 100 ఏళ్లకోసారి వచ్చే 28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునే స్థాయిలో ఈ కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాలి. ఇందులో దశలవారీగా చదును చేస్తూ గట్టిపరుస్తూ నిర్మించుకుంటూ రావాలి. కేవలం మూడు నెలల్లో ఇంత పని చేయడం అంత సులభమేమీ కాదని చెబుతున్నారు. స్పిల్ వే కాంక్రీటు పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయి. ఆగ్రిగేట్ చిల్లింగ్ ప్లాంట్ పని చేయించడం సోమవారమే ప్రారంభమైంది. కొత్త గుత్తేదారు కూడా ఖరారు కావడానికి సమయం పడుతుంది.
ముందు చూపు లేని పరిస్థితుల్లో ముందుకెళ్లని పోలవరం
స్పిల్ వే కాంక్రీటు పనులు, స్పిల్ ఛానల్ మట్టి తవ్వకం, కాంక్రీటు పనులు చేయాల్సి ఉంది. ఒక్క స్పిల్ ఛానల్లోనే 8 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాలి. స్పిల్ వేలో 15 లక్షలకు పైగా కాంక్రీటు పని చేయాలి. ఈ పనులు చేస్తూనే గేట్ల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలి. మరోవైపు స్పిల్ ఛానల్లో చివర గోదావరి నీటిని మళ్లించి నీటిని తిరిగి గోదావరిలోకి కలిపే మార్గంలో గట్లను 31 మీటర్ల ఎత్తుకు పటిష్ఠంగా నిర్మించుకోవాలి. ఇవన్నీ 150 రోజుల్లో పూర్తిచేయడం సులభమేమీ కాదు.
2019 జూన్లోనే ఎగువ కాఫర్ డ్యాం నుంచి నీటి సరఫరా
ఈ పరిస్థితుల్లో అయితే గియితే 2019 జూన్కే ఎగువ కాఫర్ డ్యాం ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యం అవుతుందని చెబుతున్నారు. ప్రధాన డ్యాంలో డయా ఫ్రం వాల్ పనులు పూర్తయినా ఒక సీజన్లోనే పూర్తిస్థాయి డ్యాం పనులు పూర్తి చేయడం సాధ్యం కాదని, ఇందుకు రెండు సీజన్లు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.
నెలలు గడుస్తున్నా పోలవరానికి రాని గడ్కరీ
ఇదిలా ఉంటే పోలవరంపై కేంద్రం చెప్పే కబుర్లు చాలా తీయగా ఉంటాయి. ‘ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాదే. అంతా మేం చూసుకుంటాం' అని కేంద్రం చెబుతుంది. ఆ తర్వాత మళ్లీ ఎవరైనా వెళ్లే వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం అందించే వ్యవహారం డోలాయమానంగా మారుతున్న వేళ.. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొహం చాటేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. పదిహేను రోజులకు ఒకసారి ప్రాజెక్టును సందర్శించి సత్వరం పనులు పూర్తి చేయించేస్తానని గతంలో మాట ఇచ్చిన ఆయన నెలలు గడుస్తున్నా ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇటువైపు రాకపోవడం ప్రజల్లో సందేహాలకు తావిస్తోంది.
రెండు గడువులు దాటినా పరిస్థితిలో నో ‘ఛేంజ్'
గతంలో అధికారులు, ఏపీ మంత్రులతో సమీక్షించినప్పుడు కేంద్ర నీటి పారుదలశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతి 15రోజులకు ఒకసారి పోలవరం వచ్చి తాను పనులు వేగంగా అయ్యేలా చూస్తానని మాట ఇచ్చారు. అది జరిగి కూడా రెండు నెలలు దాటినట్లుగా కనిపిస్తోంది. తొలుత డిసెంబర్ 22న గడ్కరీ పోలవరానికి వస్తారని చాలా ప్రచారం జరిగింది. దీనికి ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు కూడా చేసినా తర్వాత అది రద్దయింది. 23న నిపుణుల కమిటీ మాత్రం వచ్చి వెళ్లింది. ఆ పిమ్మట ఢిల్లీనుంచి ఈ నెల ఏడో తేదీన గడ్కరీ పోలవరం రాబోతున్నారని మరో ప్రకటన వచ్చింది. ఏడో తేదీ దాటిపోయినా ఆయన మాత్రం రాలేదు.
17న మోదీతో బాబు భేటీ తర్వాత మార్పుపైనే ఆశలు
కేంద్రం పోలవరానికి నిధులు ఇవ్వకుండా నాన్చడం వల్లే స్వయంగా ప్రాజెక్టు వద్దకు వస్తే.. నిదులు, ప్రాజెక్టు పనుల వేగం గురించి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుందనే భయంతోనే నితిన్ గడ్కరీ మొహం చాటేస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమైన తర్వాతైనా పరిస్థిత్లుల్లో ఏదైనా మార్పు వస్తుందేమో? అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తున్నారు.