వ్యతిరేకిస్తాం, పోలవరం డిజైన్ మార్చాలి: ప్రకాష్ కారత్
విజయవాడ: ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాజెక్టు నమూనాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనీ సిపిఎం జాతీయ నాయకుడు ప్రకాష్ కారత్ చెప్పారు. వెంటనే పోలవరం ప్రాజెక్టు కొత్త డిజైన్ చేపట్టాలని ఆయన సూచించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు.
నీరు, విద్యుత్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణం చర్చించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన తప్పుపట్టారు. కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేలా మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని ప్రకాష్ కారత్ విమర్శించారు.
ఎన్నికల్లో నల్లధనం వినియోగం పెరిగిపోయిందని అన్న ఆయన, అందుకే వామపక్షాలు చతికిల పడ్డాయన్నారు. ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని ప్రకాష్ కారత్ చెప్పారు.
కాగా, ఇప్పటికే తెలంగాణ, ఒరిస్సా ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నమూనాను మార్చి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.