పోలవరంపై జగన్ మరో కీలక నిర్ణయం? వైఎస్ పేరు పెట్టే ఛాన్స్!
Recommended Video
అమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా జల వనరుల శాఖ కొన్ని ప్రతిపాదనలను రూపొందించిందని సమాచారం. త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలన కోసం ఆయన కార్యాలయానికి పంపించ వచ్చని అంటున్నారు. వైఎస్ఆర్ పోలవరం అనే పేరు పెట్టాలని జల వనరుల మంత్రిత్వశాఖ అధికారులు సూచనప్రాయంగా నిర్ణయించిందని చెబుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ పేరును ఆ ప్రాజెక్టుకు పెట్టడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.
వైఎస్ హయాంలోనే కదలికలు..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుకు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు వైఎస్ ప్రభుత్వ హయాంలోనే లభించాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికీ తన హయాంలోనే కొన్ని ప్రతిపాదనలను పంపించారు.
ప్రాజెక్టు పనుల్లో జాప్యం ఏర్పడకూడదనే ఉద్దేశంతో వైఎస్.. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి ముందే కాలువల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం ఆ కాలువల ద్వారానే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి వరద నీటిని కృష్ణానదికి అనుసంధానించింది గత చంద్రబాబు ప్రభుత్వం.
రివర్స్ టెండరింగ్ కొలిక్కి వచ్చిన వెంటనే..
తాజాగా- పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రివర్స్ టెండరింగ్ వల్ల నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడినప్పటికీ.. అవి ఎంతో కాలంపాటు కొనసాగలేకపోవచ్చు. రివర్స్ టెండరింగ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులు కొనసాగడం ఖాయం. ఈలోగా పోలవరానికి వైఎస్ పేరును పెట్టాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకోవచ్చని జల వనరుల శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని అరికట్టడంతో పాటు.. తన హయాంలోనే దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని వైఎస్ జగన్ సంకల్పించారని వారంటున్నారు. ఆ ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెడితే ఆ ప్రాజెక్టు సార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పాత డిమాండే.. కొత్తగా
నిజానికి- పోలవరానికి వైఎస్ పేరు పెట్టాలనే డిమాండ్ మరీ పాతదేమీ కాదు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ డిమాండ్ వినిపిస్తూనే వస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ డిమాండ్ ను లేవనెత్తారు. పార్టీ అధికారంలో ఉండటం, వైఎస్ కుమారుడు ముఖ్యమంత్రిగా ఉండటం.. వంటి సానుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో.. వైఎస్ పేరును పోలవరానికి పెట్టాలనే డిమాండ్ ఈ సారి మరింత ఊపందుకుంది. వైఎస్ దశమ వర్ధంతి సందర్భంగా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి వినిపించింది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు? అనే ప్రశ్నను సంధిస్తున్నారు వైసీపీ నాయకులు.
వైఎస్ఆర్సీపీ నేతల నుంచే..
మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సహా పలువురు నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ కల అని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకుని రావడం, కాలువలను తవ్వంచడం ఆయనే చేశారని గుర్తు చేశారు. వైఎస్ దశమ వర్ధంతి సందర్భంగా తమ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయా నాయకులు పలు సందర్భాల్లో పోలవరానికి వైఎస్ పేరును పెట్టాలనే డిమాండ్ ను చేశారు.