పోలవరం కాంక్రీట్ పనులు వాయిదా : జనవరిలో కొనసాగింపు
ఏపి జీవనాడి పోలవరం కాంక్రీట్ పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. ఏపి పై తుఫాను ప్రభా వం కారణంగా ఇప్పుడు పనులు ప్రారంభిస్తే ఉపయోగం ఉండదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.ఈ కారణంతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కావాల్సిన కాంక్రీట్ పనులను జనవరికి వాయిదా వేస్తూ నిర్ణయించారు.
పోలవరం లో కీలకమైన కాంక్రీట్ పనులను ఈ నెల 16,17 తేదీల్లో ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్రంలో ఈ నెల 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ కారణంగా పోలవరం ప్రాజెక్ట్ వద్ద రికార్డ్ స్థాయి కాంక్రీట్ పనులు జనవరికి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇరిగేష్ శాఖా మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. 10,069 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
కేంద్రం నుంచి ఇంకా రూ. 3,342 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర జల సంఘానికి నివేదికలు, లెక్కలు పంపిస్తున్నా మని మంత్రి తెలిపారు. కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని విమర్శించారు. బకాయి నిధులను వెంటనే విడుదల చేస్తే నిర్వాసితులకు సాయం చేస్తామన్నారు. పోలవరం డీపీఆర్-2ను కేంద్రం ఆమో దించడం లేదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 62.16 శాతం పోలవరం పనులు పూర్తి అయినట్లు చెప్పారు. తమ మీద కక్షతో నిధులు నిలిపివేసి రైతులు, ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు. పోలవరం నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని దేవినేని అన్నారు.
తొలుత, ఈ ఏడాది చివరికి పోలవరం గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే, సాంకేతికంగా ఎదురైన సమస్యల కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్ల మార్పు..నిధుల విడుదల వంటి అంశాల కారణంగా షెడ్యూల్ కంటే పనులు ఆలస్యమయ్యాయి. దీంతో..వచ్చే జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామ ని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది.