కదం తొక్కిన ముంపు బాధితులు: 14న ఢిల్లీలో ధర్నా
ఈ సందర్భంగా జరిగిన ఆదివాసీల ఆత్మగౌరవ సభలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొని ప్రసంగించారు. రాజకీయ పార్టీలు ద్వంద్వ విధానాలకు స్వస్తిపలికి ఆదివాసీల హక్కుల పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ వారం రోజులు కీలకమైనవని, ఉద్యమాన్ని వివిధ మార్గాల్లో ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు.
రానున్న రోజుల్లో చట్టసభల్లో పోలవరం ఆర్డినెన్స్పై చర్చల్లో మన్యంవాసులకు లాభం చేకూర్చేలా ఉద్యమాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతకాలంగా సాగిస్తున్న ఉద్యమాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు వచ్చిందని, ఇంకా ఆదివాసీల గుండెచప్పుడు వారి చెవిలో మార్మోగేలా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ సభకు సుమారు 10 వేల మంది ముంపు బాధితులు పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లలోని ఏడు మండలాల నుంచి తరలివచ్చారు.
సంప్రదాయ విల్లంబులు, కొమ్ము, రేలా నృత్యాలు, తమ సంస్కృతిని ప్రతిబింబించే డప్పులతో భద్రాచలం పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో సిపిఎం శ్రేణులు ‘స్టాప్ పోలవరం' నినాదంతో ఉన్న జాకెట్లు ధరించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వాసితులు ప్రదర్శనలో పాల్గొని పోలవరం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా సింహనాదం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోతే మరో మన్యం పోరాటాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.