బిగ్ న్యూస్: సీఎం జగన్ నెత్తిన కేంద్రం పాలు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.48వేల కోట్లు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వరదాయినిపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైనది.. భారీ ఖర్చుతో కూడుకున్న భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సవరించిన అంచనాలతో కూడిన వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తద్వారా 2021లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ నెత్తిన మోదీ సర్కార్ పాలుపోసినట్లయింది. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇంతటి కీలక ప్రకటన వెలువడటం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర జల్శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ(ఆర్ఈసీ) గతవారమే అంచనాలకు ఆమోదం తెలపగా, ఆ నివేదికకు ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం లాంఛనమే.
కేంద్రం ఏం చెప్పిందంటే..
పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనాలు గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లోనే వున్నాయి. శుక్రవారం సవరించిన అంచనాలను విడుదల చేసిన కేంద్రం.. ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ.55,545కోట్లుగా పేర్కొంది. భూసేకరణ, పునరావాస కల్పన బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేసింది. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి రూ.48వేల కోట్ల నిధులకు ఆర్థిక శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే పోలవరంపై కేంద్రం రూ.16వేల కోట్లు ఖర్చుచేసి ఉండటంతో.. ఆ మిగతా రూ.32వేల కోట్లను ఇచ్చేందుకు రెడీ అయింది. ఆడిటింగ్ పూర్తయిన వెంటనే నిధుల విడుదలకు మార్గం సుగమం కానుంది.
వేటికి ఎంతంటే..
పాత ఖర్చులు రూ.16వేల కోట్లు పోను, కొత్తగా రూ.32 వేల కోట్లు ఇస్తానని స్పష్టం చేసిన కేంద్రం.. ఆ డబ్బును దేనికి వెచ్చించబోయేదీ స్పష్టంగా పేర్కొంది. రూ.5వేల కోట్లను ప్రాజెక్టు ఇంజనీరింగ్ పనుల కోసం కేటాయించిన కేంద్రం.. భూసేకరణ, పునరావాసం పనుల కోసం మిగతా రూ.27వేల కోట్లను వెచ్చించనుంది. పునరావాసంపై పొరుగు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సమాంతరంగా పునరావాస పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపింది.
అయినాసరే ఏపీపై భారమే..
పోలవరం కాఫర్ డ్యామ్, మెయిన్ డ్యామ్ పనులు వచ్చే జూన్లోగా పూర్తిచేయకపోతే వానాకాలంలో పనులు జరిగే అవకాశం ఉండదు. ఆ పనులు జరగాలంటే ముందుగా ఆర్ అండ్ ఆర్, భూసేకరణపై స్పష్టత రావాల్సి ఉంది. శుక్రవారం నాటి ప్రకటనతో కేంద్రం ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. నిజానికి భూసేకరణ, పునరావాస పనుల కోసం మొత్తం రూ.33 వేల కోట్లు కావాల్సి ఉండగా.. కేంద్రం రూ.27వేల కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఏపీపై అదనంగా రూ.6వేల కోట్ల భారం పడనుంది.
గ్రౌండ్ రియాలిటీ..
పోలవరం ప్రాజెక్టు పురోగతి పరిశీలిస్తే.. హెడ్ వర్క్సు 58.50 శాతం పూర్తికాగా, స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్ క సంబంధించి 1050 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. కాంక్రీటు పనులకు సంబంధించి 38.88 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటి వరకు 30.75 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. ఎగువ కాఫర్ డ్యామ్ 73.94 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సివుండగా ఇప్పటివరకు 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. దిగువ కాఫర్కు సంబంధించి 25.46 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి వుండగా కేవలం 3.37 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగింది. వర్షాకాలం లోపు ఈ పని పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో వచ్చే ఏడాది వరకు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆగాల్సిందే. దీనికి అనుసంధానంగానే ప్రధాన డ్యామ్ పని కూడా ముడిపడివుంది.
Recommended Video
బాబు వల్లే భారం..
విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని.. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు మరింతగా భ్రష్టుపట్టించారని, టీడీపీ అవినీతి, అక్రమ విధానాల కారణంగా రాష్ట్రం అధోగతిపాలయ్యే పరిస్థితిలో నిలిచిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నుంచి పెండింగ్ బిల్లుల దాకా బాబు చేసిన గబ్బును కడుక్కోవడం తలకుమించిన భారంగా తయారైందని, ఈ పరిస్థితుల్��ో ఆదుకోవాల్సిందిగా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశామని ఆయన చెప్పారు. నితి ఆయోగ్ లో వ్యవసాయ, సాగునీటి నిపుణులను కలిసి ఏపీకి సంబంధించిన విషయాల్ని సమగ్రంగా వివరించి, సాయం కోరానని బుగ్గన తెలిపారు.