పోలవరంపై సుజనా చౌదరి ప్రశ్న: కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2021లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. 2019 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆ తేదీని 2021కి పొడిగించినట్లు తెలిపింది.
పోలవరం వివిధ విభాగాల కాంట్రాక్ట్ నిర్వహణ కారణాలతో గడువు పొడిగించినట్లు తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పోలవరం ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించిన నేపథ్యంలో కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 3047 కోట్ల ఖర్చు చేశారని, వీటిలో కేంద్రం నుంచి రూ. 1400 కోట్ల నిధులు ఇచ్చినట్లు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం తాము ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును అందిస్తేనే నిధులను విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల ఆడిట్ జరగకుండా నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని ఆర్థిక శాఖ నవంబర్ 26, 2019న నోట్ ఇచ్చినట్లు గుర్తు చేసింది. అయితే, పోలవరం ప్రాజెక్టును 2021 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక ఏపీ ప్రభుత్వం కూడా 2021నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. పోలవరం పనులు ఆగిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అంటున్నారు.
ఇది ఇలావుంటే, పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఇటీవల ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్ను న్యాయస్థానానికి సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఒడిశా ప్రుభుత్వం కోర్టుకు వివరించింది. పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని, ప్రాజెక్టు వద్ద గరిష్ట వరద ప్రవాహం ఏపీ చెప్పినదాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఒడిశా వాదించింది.
ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేస్తూ 2018, జులై 10, ఆ తర్వాత 2019, జూన్ 27 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులపై రద్దు చేయాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ట్రైబ్యునల్కు ఏపీ సర్కారు సమాచారం ఇచ్చినట్లుగా.. పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 36 లక్షల క్యూసెక్కులు కాకుండా 50 లక్షల(14లక్షల క్యూసెక్కులు ఎక్కువ) క్యూసెక్కుల వరకు ఉంటుందని ఒడిశా వివరించింది. రూర్కీ ఐఐటీ సర్వే ప్రకారం గోదావరిలో గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని ఒడిశా సర్కారు వాదనలు వినిపించింది. అదే జరిగితే ఒడిశా పరిధిలోని శబరి, సీలేరు ప్రాంతాల్లో 200 అడుగులకుపైగా ముంపు తలెత్తుతుందని, అంత వరద ప్రవాహాన్ని పోలవరం డ్యాం తట్టుకోలేదని స్పష్టం చేసింది.