పోలవరం చక చకా- ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం- శాంతించిన గోదారి
పోలవరం ప్రాజెక్టులో ఇవాళ మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. జల వనరులశాఖ అధికారులు భారీ యంత్రాల సాయంతో ఇవాళ ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది చివరి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సాగిపోతున్న ప్రభుత్వానికి తాజా పరిణామాలు ఊరటనిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగిపోతున్నాయి. ఈ మధ్యనే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు అవసరమైన గడ్డర్ల ఏర్పాటు ప్రారంభం కాగా.. కొన్ని రోజుల వ్యవధిలోనే తొలి గేటు బిగింపు పూర్తయింది. ఇదే క్రమంలో ఇవాళ రాక్ ఫిల్ డ్యామ్ పనులను కూడా అధికారులు ప్రారంభించారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం గోదావరి కాస్త శాంతించడంతో పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కంర్యాక్ ఫిల్ డ్యాం పనులు తిరిగి మొదలయ్యాయి.
ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్కు ముందుగా ఇసుక పటుత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు శాండ్ ఫిల్లింగ్ పనులు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే వైట్ కాంప్యాక్షన్ పనులు 10 లక్షల 85 వేల 625 క్యూబిక్ మీటర్ల మేర పూర్తయ్యాయి. అలాగే శాండ్ ఫిల్లింగ్ పనులు కూడా లక్షా 61 వేల క్యూబిక్ మీటర్లు పూర్తి చేశారు. ఇవాళ రాక్ ఫిల్ డ్యామ్ పనుల ప్రారంభ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఈఈ మల్లిఖార్జునరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్ద జీఎం ముద్దుకృష్ణ, ఏజీఎం క్రాంతి కుమార్, కెల్లర్ సంస్ద సీనియర్ ఇంజనీర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు..
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అలాగే 2022 ఖరీఫ్ సీజన్ నాటికి అంటే జూలై నాటికి గ్రావిటీ ద్వారా పంట పొలాలకు సాగునీరు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్తో సమన్వయం చేసుకుంటూ అధికారులు పనుల వేగం పెంచారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు పూర్తవడం ఖాయంగా కనిపిస్తోంది.