పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సిఈవో కు షాక్ .. రేపే రివర్స్ టెండరింగ్... వెనక్కు తగ్గని జగన్
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆగస్టు 17 వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చెప్పినప్పటికీ ఆయన చెప్పిన అంశాలను బేఖాతరు చేస్తూ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ముందడుగు వేయాలని భావిస్తున్నారు జగన్.
రివర్స్ టెండరింగ్ నష్టమని చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సిఈ వో ఆర్ కే జైన్
ఒకపక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముందని ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సీఈవో ఆర్ కె జైన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్వహిస్తున్న కంపెనీల పనితీరు కూడా బాగానే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం వల్ల పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని, ఖర్చు కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించడానికి వేసిన నిపుణుల కమిటీకి ఉన్న ప్రాతిపదిక ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో ఏకీభవించని సీఈవో జైన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ విధానంలో ఉన్న ఇబ్బందులను గురించి తాము ఏపీ ప్రభుత్వానికి సూచించామని ఆయన పేర్కొన్నారు.
సిఈవో చెప్పిన విషయాలు బేఖాతరు .. 17వ తేదీన రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్
జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించిన మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 3128 కోట్ల మేర అవినీతి జరిగిందని నిర్ధారించిన నిపుణుల కమిటీ ఆ సొమ్మును రికవరీ చేయడంతో పాటుగా మిగిలిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సిఫార్సు చేశారు . ఇక అందులో భాగంగా ఈనెల 17వ తేదీన రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. హెడ్ వర్క్స్ లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు కాకుండా, మిగిలిన పనులతో పాటుగా హైడల్ ప్రాజెక్టు ను కలిపి టెండర్లను పిలవనున్నారు మొత్తం 5070కోట్ల పనులను రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
కేంద్రం సలహాలు, సూచనలు లెక్కచెయ్యని జగన్ ... కేంద్రం సహకరిస్తుందా ?
రివర్స్ టెండరింగ్ నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పినప్పటికీ జగన్ ఏమాత్రం తగ్గకుండా రివర్స్ టెండరింగ్ కే వెళ్లనున్నారు.ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు కేంద్రంలోని సంబంధిత జనశక్తి శాఖకు మింగుడు పడని నిర్ణయాలు అయినప్పటికీ, జగన్ నిర్ణయాలపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ జగన్ ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ దీని ప్రభావం ముందు ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏ విధంగా ఉండబోతుందో అన్న అనుమానాలు లేకపోలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కేంద్రం జగన్ కు సహకరిస్తుందా.. లేకా అవాంతరాలు సృష్టిస్తుందా అనేది ముందు ముందు తెలియనుంది.