పోలవరంలో మరో ముందడుగు- క్రస్ట్ గేట్ల కోసం ఆర్మ్ గడ్డర్ల ఏర్పాటు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో ఇవాళ మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన క్రస్ట్ గేట్ల బిగింపు కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా గోదావరి వరదలు, ఇతర కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఇవాళ క్రస్ట్ గేట్ల ప్రక్రియలో కీలకమైన ఆర్మ్ గడ్డర్ల బిగింపు ప్రక్రియను ప్రారంభించారు.
ప్రస్తుతం గోదావరి వరదలు కూడా తగ్గడంతో క్రస్ట్ గేట్ల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు అధికారులు లాంఛనంగా గడ్డర్ల బిగింపు ప్రక్రియను పూజలు చేసి ప్రారంభించారు. ఎస్ఈ నాగిరెడ్డి తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి గేట్లకు సంబంధించిన ఆర్మ్ గడ్డర్లను లిఫ్ట్ చేశారు. రేపటి నుంచి గడ్డర్ల బిగింపు చురుగ్గా సాగబోతోంది. వచ్చే ఏడాది మే నెలాఖరులోపు క్రస్ట్ గేట్ల బిగింపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు కోసం అవసరమైన 48 గేట్లను సిద్ధం చేశారు. గడ్డర్ల బిగింపు తర్వాత వీటిపై రేడియల్ గేట్లను బిగిస్తారు. ఈ ప్రక్రియ ముగియగానే ఇతర పనులు కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నారు.
తాజాగా సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులకు మార్గదర్శనం చేశారు. అలాగే వచ్చే ఏడాది డిసెంబర్ను ప్రాజెక్టు పూర్తి కావడానికి డెడ్లైన్గా నిర్ణయించారు. 2022 ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే జూలై నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు పంట పొలాలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారమే పనులు వేగంగా సాగుతున్నట్లు పోలవరం ప్రాజెక్టు ఛీఫ్ ఇంజనీర్ సుధాకర్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ నాగిరెడ్డి, సీఈ సుధాకర్బాబుతో పాటు ఇతర అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎం సతీష్ బాబు, మేనేజర్ మురళి, బేకం కంపెనీ డైరెక్టర్ కాళీ ప్రసాద్ పాల్గొన్నారు,