పోలవరం టార్గెట్ 2019, ఏపీ జవాబుతో సంతృప్తి చెందితేనే ఆమోదం: తేల్చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును 2019 డిసెంబర్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రమంత్రి అర్జున్ మేఘావల్ సమాధానం ఇచ్చారు.
దశలవారీగా..
పోలవరం ప్రాజెక్టు పునరావాసం, పరిహారంపై కేవీపీ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి స్పందిస్తూ.. పోలవరం ముంపు ప్రాంతాల్లో దశలవారీగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టు అవసరమైన 1.66లక్షల ఎకరాల్లో 1.10లక్షల ఎకరాలు సేకరించామని తెలిపారు. కాగా, 98, 480 కుటుంబాలు ఈ ప్రాజెక్టుతో నిర్వాసితులు అవుతున్నారు. ఇప్పటివరకు 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ కాంపోనెంట్కు మాత్రమే 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు అందిస్తోంది.
Recommended Video
కొత్త అంచనాలపై ఆ తర్వాతే ఆమోదం
పోలవరం అంచనాల పెంపు విషయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వివరణ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తేనే.. పెంచిన కొత్త అంచనాలను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. 2010-11లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.16,101కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంచనాలను సవరించింది.
వివరణ కోరిన వాటర్ కమిషన్
ఈ సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు తాజా వ్యయం రూ.58,319కోట్లు అవుతుందని తెలిపింది. ఈ అంశాన్ని కేంద్ర వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) పరిశీలిస్తోందని, పోలవరం సవరించిన అంచనాలపై కమిషన్ కొన్ని వివరణలు కోరిందని కేంద్రం తెలిపింది.
సవరించిన అంచనాలతో సంతృప్తి చెందితేనే..
భూసేకరణ, పునరావాసం, కుడి-ఎడమ కాలువల డిజైన్ల మార్పు, హెడ్ వర్క్స్ పరిమాణం పెంపు తదితర అంశాలపై వాటర్ కమిషన్ సమాచారాన్ని కోరిందని, ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తే.. ఆ మేరకు సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపుతుందని స్పష్టం చేసింది.