నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు ... రివర్స్ టెండరింగ్ కారణమా ..
పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.. అసలు పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులలో అవినీతి జరిగిందని భావించి నిపుణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు రివర్స్ టెండరింగ్ కి వెళ్లాలనే ఆలోచన పోలవరం ప్రాజెక్టు పనులు బంద్ అవడానికి కారణమా.. అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
Recommended Video
వర్షాల వల్ల పనులు ఆగిపోయాయని ప్రకటించిన అధికారులు .. అసలు కారణం రివర్స్ టెండరింగ్
వాస్తవానికి కొంతకాలంగా పోలవరంలో పెద్దగా పనులు జరగడం లేదు .కేవలం స్పిల్ వే , కాపర్ డ్యాం రక్షణ పనులు మాత్రమే అక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల వాటిని కూడా ఆపేసినట్లు అధికారులు చెబుతున్నా అసలు కారణం మాత్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్లాలనే ఆలోచన చెయ్యడమే పనులు ఆపడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
దేశంలో ఇప్పటివరకు రివర్స్ టెండరింగ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదు కానీ ఏపీ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటిగా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాచరణ రూపొందిస్తోంది .
ఇప్పటికే దుకాణం సర్దేసిన త్రివేణి సంస్థ.. నత్తనడకన నవయుగ సంస్థ పనులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన నిపుణుల కమిటీ పోలవరంలో అవినీతి జరిగిందని తేల్చింది ఈ నెల 13న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిటీ గత ప్రభుత్వ హయాంలో 2346.85 కోట్ల అదనపు చెల్లింపులు జరిగినట్లుగా తేల్చింది. అంతేకాదు రివర్స్ అటెండర్ కి వెళ్లాలని సూచనలు కూడా చేసింది. ఇక దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు కంపెనీలు నిదానంగా వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే త్రివేణి సంస్థ దుకాణం సర్దేసింది. ఇక స్పిల్ వే , పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టిన నవయుగ సంస్థ ఉద్యోగులను క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న కంపెనీలకు జగన్ నిర్ణయంతో భయం పట్టుకుంది. అందుకే పోలవరం ప్రాజెక్టు పనులను చేయకుండా తాత్సారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పోలవరంపై నీలినీడలు .. ఇలా అయితే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాదని టీడీపీ , పూర్తి చేస్తామని వైసీపీ
ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి వర్షం కారణంగా పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నా, రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ తీసుకున్న నిర్ణయమే పోలవరం ఆగి పోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదు అన్నది ప్రతిపక్షాల వెర్షన్.
అవినీతిపై తప్ప పోలవరం పూర్తి చేయాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైసీపీ సర్కార్ ఆరోపిశుంది. వైఎస్ హయంలో ప్రారంభించిన పనులను జగన్ హయంలోనే ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని ఏపీ సాగునీటి శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు.అందుకు తగ్గట్టుగానే రివర్స్ టెండరింగ్ కి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. ఖర్చు తగ్గించటం , నాణ్యత ఉన్న పని చేయించటం లక్ష్యంగా రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామని చెప్తున్న కేవలం టీడీపీ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ రివర్స్ టెండరింగ్ అని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు .