ఈ ఏడాదీ తప్పని పోలవరం వరద ముంపు- పూర్తికాని పునరావాసం - జనానికి చుక్కలు..
ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయినిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడం స్ధానిక గ్రామాలకు ఏటా శాపంగా మారుతోంది. ఓవైపు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పట్టొచ్చని భావిస్తుండగా.. ఆ లోపు పునరావాస కార్యక్రమాలు కూడా పూర్తికాలేదు. దీంతో ఏటా వర్షాకాలంలో వచ్చే వరదనీరు పోలవరం గ్రామాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. వరద పోటు కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయి పరిస్ధితి. గతేడాది ఇదే పరిస్దితి ఉండగా... ఈసారి కూడా ఎలాంటి మార్పూ లేదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఏపీ విభజన తర్వాత తెలంగాణలో ఉన్న పోలవరం పరిధిలోకి వచ్చే ఆరు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయ్యాయి. అప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టడం, నానాటికీ ఆలస్యమవుతుండటం, ఆ లోపు పునరావాసం కూడా పూర్తి కాకపోవడంతో ఈ గ్రామాల్లో ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. గతేడాది ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి గోదావరి నీరు వెనక్కి ఎగదన్నడంతో దాదాపు నెల రోజుల పాటు పోలవరం గ్రామాలు ముంపులోనే ఉండిపోయాయి. ఇప్పటివరకూ పునరావాస కార్యక్రమం పూర్తి కాకపోవడంతో మళ్లీ గోదావరి వరద ముంపు బారిన పడేందుకు ఈ గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇది నెలాఖరు కల్లా ఉగ్రరూపం దాల్చడం ఖాయం. అదే జరిగితే మరోసారి పోలవరం గ్రామాలన్నీ వరద ముంపు బారిన పడటం ఖాయమే. ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడి గ్రామాల ప్రజలకు ఇస్తున్న పునరావాస ప్యాకేజీ ఏమాత్రం సరిపోయేలా లేదని స్ధానికులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపు ఆరున్నర లక్షల వరకూ పునరావాస ప్యాకేజీ ఇస్తుండగా.. వారు మాత్రం పదిలక్షలు కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదల కాక ఈ మొత్తం ఇవ్వలేని పరిస్ధితి నెలకొంది. దీంతో జనం ఊళ్లు ఖాళీ చేసేందుకు కూడా సిద్దంగా లేరు. సమస్య ముదిరితే ప్రభుత్వం ఈసారి ఏం చేయబోతోందో చూడాల్సి ఉంది.