వర్షాల కారణంగా నెమ్మదించిన పోలవరం పనులు...ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి:పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే వర్షాల కారణంగా పనులు నెమ్మదించాయని నిర్మాణ సంస్థ ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు తెలిపింది.
గేలరీ వాక్ నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతుందని నిర్మాణ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరణ ఇచ్చింది. గేట్ల ఏర్పాటు ప్రక్రియ అనుకున్న గడువు కంటే స్వల్పంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్లో కేంద్ర బృందం పరిశీలనకు వచ్చే సమయానికి కాఫర్ డ్యాం, స్పిల్వే పనులు వేగవంతం చేస్తామని, పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు.
నెమ్మదించిన...పోలవరం పనులు...
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వర్షం కారణంగా మందగించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు నివేదించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులపై సిఎం చంద్రబాబు సమీక్ష సందర్భంగా అధికారులు ఈ విషయాన్ని ఆయనకు తెలిపారు. అయితే సెప్టెంబర్ లో కేంద్ర బృదం పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు రానున్నందున అప్పటికల్లా పనులు ముమ్మరంగా సాగుతాయని వివరించారు.
సిఎం చంద్రబాబు...సూచనలు
అధికారుల వివరణపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షాలు తగ్గిన వెంటనే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. సెప్టెంబర్ లో జరిగే గ్యాలరీ వాక్ కు తాను హాజరవ్వాల్సి ఉందని సిఎం చంద్రబాబు చెప్పారు.
ఢిల్లీలో...దేవినేని ఉమ
మరోవైపు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ సమావేశంలో నీటి పారదలకు సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరామన్నారు. పోలవరానికి కేంద్రం రూ.2700 కోట్లు రీయింబర్స్ మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
మే నాటికి...పనులు పూర్తి
దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి దేవినేని ఉమ చెప్పారు. ఈ భేటీలో గోదావరి నీటిని కావేరి బేసిన్కు తరలించే అంశంపై కూడా సమీక్ష జరిగిందని మంత్రి తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానానికి ముందు నీటి లభ్యత లెక్కించాలని కోరడం జరిగిందన్నారు. సెప్టెంబర్3న పోలవరంలో గ్యాలరీ వాక్కు చంద్రబాబు హాజరవుతారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి నాటికి గేట్లు, మే నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని చెప్పారు. త్వరలో వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తున్నామని, నీటి నిర్వహణలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని దేవినేని ఉమ చెప్పుకొచ్చారు.