పోలవరం ఫ్రస్ట్రేషన్: దేవినేని ఉమపై జోక్లు పేల్చిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై జోకులు పేల్చారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశం తర్వాత రాజధానిలోని శాకమూరులో అంబేద్కర్ స్మృతివనం డిజైన్ల ప్రదర్శనను మంత్రులు తిలకించారు.
ఆ సమయంలో దేవినేనిపై చంద్రబాబు జోకులేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం అడ్డంకులు కల్పించిన నేపథ్యంలో తీవ్ర నిరాశకు, నిస్పృహకు గురైన నేపథ్యంలోనే చంద్రబాబు తన సహజశైలికి భిన్నంగా ఆ జోకులు వేశారని అంటున్నారు.
దేవినేనిపై చంద్రబాబు ఇలా..
స్మ్మతి వనంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పలు సూచనలు చేశారు. అయితే ఈ సూచనలపై చంద్రబాబు స్పందిస్తూ దేవినేనికి పోలవరం జ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించారు. దీంతో సహచర మంత్రులు నవ్వుకున్నారు.
పోలవరంపై అది సరి కాదు...
పోలవరం విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. పోలవరం కోసం కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకుని వస్తామని స్పష్టం చేశారు. పోలవరం వ్యవహారంలో సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కారించుకోవాలే తప్ప పాజెక్ట్ను అపేయమనడం సరైంది కాదని అన్నారు.
కేంద్రమే ఖర్చు చేయాలి..
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఇందుకు కావాల్సిన ప్రతి పైసా కేంద్రం ఖర్చు చేయాలని అయన్నపాత్రుడు అన్నారు. పోలవరం పూర్తి అయితే తమ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగు ఉండదన్న విషయాన్ని గ్రహించి, సహించలేకనే కొందరు నేతలు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. పోలవరం కోసం ఎంత వరకైనా వెళ్తామని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం పూర్తి చేసి తీరుతామని అన్నారు.
పురంధేశ్వరిపై అయన్న నిందలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నది బిజెపి నేతలు దగ్గుబాటి పురందశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ, కావూరి సాంబశివరావేనని మంత్రి అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం లేఖ రాయడం భాదాకరమని అన్నారు. ఏపీకి చెందిన కొంతమంది బీజేపి డూప్లికేట్ నేతల వల్లే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు వస్తున్నాయని అన్నారు.
పోలవరంపై కంభంపాటి ఇలా...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నదే కేంద్రం ఆకాంక్ష అని ఆయన అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి సామరస్యంగానే నిధులు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. విభజన చట్టంలోని అన్ని హామీలు అమలయ్యేలా కేంద్రం చూస్తుందని, ఈ విషయమై త్వరలోనే ఏపీ బీజేపీ నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళతామని హరిబాబు అన్నారు.