రఘునందన్ ఇంటిపై పోలీసుల ఆకస్మిక దాడులు... తీవ్ర ఉద్రిక్తత...
దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో సోమవారం(అక్టోబర్ 26) ఏక కాలంలో పోలీసులు,రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేటలో నిర్వహించిన ఈ సోదాల్లో రఘునందన్ రావు బంధువుల ఇంట్లో రూ.18.67లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల విషయం తెలిసిన వెంటనే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని పక్కనపెట్టి సిద్దిపేటలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే అప్పటికీ సోదాలు కొనసాగుతుండటంతో పోలీసులు ఆయన్ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు,రఘునందన్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
దుబ్బాక ఉపఎన్నిక.. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం : కిషన్ రెడ్డి ఏమన్నారంటే
దుబ్బాకలో ఓడిపోతామన్న భయంతోనే : రఘునందన్ రావు
సెర్చ్ వారెంట్ లేకుండా ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు నిర్వహించారో చెప్పాలంటూ పోలీసులను రఘునందన్ రావు ప్రశ్నించారు. తన ఇంట్లో ఇప్పటివరకూ ఏమి స్వాధీనం చేసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్ల లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించడమేంటని,టీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలు ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓడిపోతామన్న భయంతోనే టీఆర్ఎస్ పోలీసులతో దాడులు చేయిస్తోందన్నారు. సోదాల సమయంలో ఇంట్లో ఉన్న తన భార్యతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.
హరీశ్ రావు ఇంట్లో సోదాలు చేయరా... : రఘునందన్
తన భార్య,కుటుంబ సభ్యుల ఫోన్లను ఎందుకు లాక్కున్నారని రఘునందన్ రావు పోలీసులను ప్రశ్నించారు. పోలీసులే తన ఇంట్లో ఏవైనా పెట్టి తనను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఏ సమాచారంతో తన ఇంట్లో సోదాలు నిర్వహించారని నిలదీశారు. తన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లే హరీశ్ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రఘునందన్ రావు ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.సుమారు మూడు గంటల పాటు రఘునందన్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇటీవల పట్టుబడ్డ రూ.40లక్షలు
అక్టోబర్ 5న హైదరాబాద్ శివారులోని శామీర్పేటలో ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.40లక్షలు బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు చెందినవిగా పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో ఆ డబ్బును రఘునందన్ రావుకు అందించేందుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా రఘునందన్ రావు బంధువుల ఇంట్లో రూ.18.67లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఆ వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. నవంబర్ 3న దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం కావాలనే తమను ఇబ్బందులకు గురిచేస్తోందని రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.