కాల్పుల కలకలం:నెల్లూరులో వ్యాపారి కాల్చివేత;నగరంలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
నెల్లూరు:నెల్లూరులో గుర్తుతెలియని వ్యక్తులు ఒక వ్యాపారవేత్తని కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కారణాలేమిటో తెలియదు శనివారం రాత్రి వేళ బైక్ పై వ్యాపారి షాప్ వద్దకు ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారు.
దీంతో తీవ్రంగా గాయపడిన వ్యాపారి అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనతో నెల్లూరు నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వ్యాపారి హత్యకు ఆర్థిక కారణాలా, వ్యక్తిగత కారణాలా అనేది తెలియాల్సి వుంది. వివరాల్లోక వెళితే...
పోలీసుల కథనం ప్రకారం...రాజస్థాన్ రాష్ట్రం అర్తండికి చెందిన కె. మహేంద్రసింగ్(40), ఉష దంపతులు సుమారు పదేళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. ఇతడికి ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి సంతానం. నగరంలోని ఫత్తేఖాన్పేటలో నివాసం ఉంటున్న మహేంద్రసింగ్ ఆరంభంలో మార్బుల్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
ఆ తరువాత మూడేళ్లకి ఫత్తేఖాన్పేటలోనే కోమల్ పవర్ టూర్స్ పేరిట మార్బుల్స్ కు సంబంధించిన పరికరాల విక్రయ దుకాణం ప్రారంభించాడు. ఏడేళ్ల నుంచి అతడు ఇదే దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో దుకాణం మూస్తున్న మన్మోహన్ సింగ్ పై ముసుగులు ధరించి బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము వెంట తెచ్చుకున్న గన్తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
ఒక్కసారిగా తుపాకి పేలిన శబ్ధం విని ఉలిక్కిపడిన స్థానికులు పరుగులు పెట్టుకుంటూ స్థలానికి వచ్చారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అక్కడ పడివున్న మహేంద్రసింగ్ ను హుటాహుటిన చికిత్స నిమిత్తం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అయితే ఛాతి, కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో రక్తస్రావం ఆగకుండా నివారించేలోపే చికిత్స ఆరంభించిన కొద్దిసేపటికే మృతి చెందాడు.
కాల్పుల సమాచారం తెలుసుకొని నెల్లూరు ఏఎస్పీ పి. పరమేశ్వరరెడ్డి, డీఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లుగా చెప్పబడుతున్న అల్లాభక్షు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సివుందని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. చిన్నబజారు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.