కరణం వర్గీయుల హత్య, గొట్టిపాటికి ఊరట: ఇదీ జరిగింది, గొట్టిపాటి మారుతి అరెస్ట్
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరంలో ఈ నెల 19వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత వారం జరిగిన ఈ ఘటనలో టిడిపి నేత కరణం బలరాం వర్గీయులు ఇద్దరు మృతి చెందారు.
ప్రకాశం: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరంలో ఈ నెల 19వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత వారం జరిగిన ఈ ఘటనలో టిడిపి నేత కరణం బలరాం వర్గీయులు ఇద్దరు మృతి చెందారు.
చదవండి: గొట్టిపాటికి చంద్రబాబు షాక్
ఈ కేసులో ప్రధాన నిందితునితో పాటు 14మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు వినియోగించిన మరణాయుధాలు, వాహనాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఒంగోలు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ హత్యల వెనుక రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ హత్యలపై కరణం - గొట్టిపాటిల మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రకటన గొట్టిపాటికి ఊరటే అని చెప్పవచ్చు.
పాత కక్షల వల్లే
గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ ఈ కేసు వివరాలను తెలిపారు. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య చోటుచేసుకుందని తెలిపారు.
వేమవరంలో క్వారీ అనుమతులు, దేవాలయాల నిర్వహణ, ప్రధాన కూడలిలో వేగ నిరోధకాల ఏర్పాటు విషయంలో నిందితుడు వెంకటేశ్వర్లు, మృతుడు రామకోటేశ్వర రావు వర్గాల మధ్య వివాదం నెలకొందని, ఇవి తారాస్థాయికి చేరడంతో హత్యకు ప్రణాళిక రూపొందించి దాడి చేశారని వివరించారు.
దాడిలో 17 మంది
ఈ దాడిలో ప్రత్యక్షంగా 17మంది పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేసినట్టు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత ప్రధాన నిందితులు మాలెంపాటి వెంకటేశ్వర్లు ,మాలెంపాటి చిన్నోడు, గొట్టిపాటి మారుతితో పాటు 14 మందిని అరెస్టు చేశామన్నారు.
మరో ఇద్దరిని అరెస్ట్ చేయాలి
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు గొట్టిపాటి నాగయ్య, తేలం రాజేష్ను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులను ఆయన అభినందించారు. వీరి మధ్య నెలకొన్న కక్షలను ముందస్తుగా గుర్తించటంలో స్థానిక పోలీసులతో పాటు.. నిఘా వర్గాలు కూడా విఫలం కావటంతోనే హత్య చోటుచేసుకుందన్నారు.
కరణం - గొట్టిపాటిల మధ్య మాటల యుద్ధం
కాగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, కరణం బలరాం వర్గీయుల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో వీరిద్దరు హత్యకు గురయ్యారని వార్తలు వచ్చాయి. ఈ హత్యలపై గొట్టిపాటి, కరణం వర్గీయులు, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.