మద్యంమత్తులో సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు హల్ చల్:మహిళలు,లేడీ కానిస్టేబుల్ కు వేధింపులు..టీసీలపై దాడి..
రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు తమను ప్రశ్నించిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్నూ వేధించారు. అంతటితో ఆగకుండా తమని నిలదీసిన టీసీలపై ఏకంగా దాడికి దిగారు. చివరకు ఆర్ఫిఎఫ్ పోలీసుల రంగప్రవేశంతో కటకటాల పాలయ్యారు.కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది.
హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఆదివారం విశాఖపట్టణంలో సిఆర్ పిఎఫ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నకేరళకు చెందిన శ్యామ్ కుమార్, బిన్నూలు తమ స్వస్థలానికి వెళ్లేందుకు ట్రెయిన్ ఎక్కారు. రైలు విజయవాడ వచ్చాక వారికి బీ1, బీ2 బోగీల్లో సీట్లు కేటాయించారు. అయితే వారు తమ సీట్లలో కాకుండా సిబ్బందికి కేటాయించే సీట్లలో కూర్చుని టాయిలెట్కి వెళ్లొచ్చే మహిళలను వేధించడం మొదలుపెట్టారు.
తమ సీట్లను వదిలి టిసికి కేటాయించిన సీటు లో కూర్చున్న ఇద్దరు కానిస్టేబుళ్లు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వారిని వేధింపులకి గురిచేస్తున్నారు. అంతేకాదు అలా ప్రవర్తించవద్దని అడ్డుచెప్పిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు టీసీలు రంగనాథ్, రాధాకృష్ణలకు కూడా ఇదే విషయం చెప్పారు. దీంతో టీసీలు ఆ కానిస్టేబుళ్ల ని నిలదీయడంతో వారు రెచ్చిపోయి ఏకంగా టిసిలపై దాడిచేసి కొట్టినట్లు తెలుస్తోంది.
రైలులో ఇలా గొడవ జరుగుతున్నక్రమంలో ప్రయాణికుల్లో ఒక వ్యక్తి చైన్ లాగడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమీపంలో రైలు ఒంగోలు స్టేషన్కు సమీపంలో ఆగింది. ఈ కానిస్టేబుళ్ల ప్రవర్తన గురించి అప్పటికే సమాచారం అందుకున్న ఒంగోలు రైల్వే ఎస్సై కుమార్ ట్రెయిన్ లో వీరు ప్రయాణిస్తున్న బోగీ వద్దకు చేరుకుని ఇద్దరు సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టీసీల ఫిర్యాదు మేరకు వారివురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్సై కుమార్ తెలిపారు.