గుప్తనిధుల కోసం తవ్వుతూ...దొరికిపోయారు:రాజధాని ప్రాంతంలో కలకలం
గుంటూరు:గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలోని కొండపై గుప్త నిధుల కోసం ఇద్దరు వ్యక్తులు తవ్వకాలు జరుపుతుండటం కలకలం సృష్టించింది. ఈ యర్రబాలెం కొండపైనున్న ఆంజనేయస్వామి గుడి వెనుక ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
అదే సమయంలో కొండపై నున్న ఆంజనేయస్వామి దర్శనార్థమని ఇదే గ్రామానికి చెందిన చిల్లర సీతారామయ్య, సోడగం నాగరాజు అనే ఇద్దరు అక్కడకు వచ్చారు. గుడి వెనుక ఇద్దరు వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్న విషయం గమనించారు. అయితే వెంటనే వారిని నిలువరించే ప్రయత్నం చేస్తే మారణాయుధాలతో దాడి చేయొచ్చని భయపడి ఫోన్ ద్వారా స్థానికులకు సమాచారం అందించారు.
దీంతో గ్రామానికి చెందిన యువకులు బృందంగా వెళ్లి కొండ పై తవ్వకాలు జరుపుతున్న వారిని అడ్డుకొని వారిని తాళ్లతో బంధించారు. వారిని గట్టిగా ప్రశ్నించగా తాము వైజాగ్కు చెందిన అమ్మ భగవాన్ ట్రస్టుకు చెందిన ఓ గురువు ఆదేశాల మేరకు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నామని, గుప్త నిధి కోసం గత 5 రోజులుగా తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారిని ఒకరు విజయనగర వాసి తోలపు రమేష్, మరొకరు దుగ్గిరాలకు చెందిన అచ్యుత పుష్ప కిరణ్ గా గుర్తించారు. అయితే గుప్త నిధుల కోసం ఎవరినీ నరబలి చేసే ఉద్దేశ్యం తమకు లేదని కేవలం పొట్ట కూటి కోసం వేరే వారు తవ్వకాలు జరిపితే ఇచ్చే డబ్బుకు ఆశపడి ఈ పనికి పాల్పడినట్లు చెబుతున్నారు.
అయితే ఇదే కొండపై కొంతకాలం క్రితం ఒక వైద్యుడు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతూ శాంతి కోసమంటూ ఇద్దరు చిన్నారులను నరబలి ఇచ్చే ప్రయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా గ్రామస్తులు సకాలంలో విషయాన్ని పసిగట్టి చిన్నారుల ప్రాణాలు కాపాడారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కొందరు దొంగచాటుగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నా వారిని పట్టుకోలేక పోయారు. గ్రామంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపకుండా నిలువరించాలని, ఆంజనేయస్వామి గుడిని పరిరక్షించాలని గ్రామస్తులు కొంతకాలంగా గట్టిగా కోరుతున్నారు.
తాజాగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. వీరి వెనుక ఎవరున్నారు ఈ ముఠా కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.