సరి కొత్త పంథాలో ఎర్రచందనం స్మగ్లింగ్....ఏడుగురు అరెస్ట్...రూ.కోటి విలువైన దుంగలు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా: ఎర్ర చందనం స్మగ్లింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో స్మగ్లర్లు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఏదోవిధంగా స్మగ్లింగ్ కొనసాగించడానికి నయా పంథా ఎంచుకుంటున్నారు. ఇదే క్రమంలో వైఎస్ ఆర్ జిల్లాలో ఒక స్మగ్లర్ల ముఠా అనుసరించిన విభిన్న మార్గం పోలీసులను సైతం విస్మయపరిచింది.
ఎలాగైనా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలి...తక్కువ కాలంలోనే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాలి ఇదీ స్మగ్లింగ్ కు పాల్పడే ముఠాల తంతు. ఇదే కోవలో ఎవరికి అనుమానం రాకుండా ట్యాంకర్ లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఓ స్మగ్లింగ్ ముఠా పోలీసులకు పట్టుబడింది.
వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం కనుమలోపల్లె దగ్గర ఇలా ఆయిల్ ట్యాంకర్లో రవాణా చేస్తున్నఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్యాంకర్ ను, అందులోని 95 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు.
సాధారణ వాహనాల ద్వారా ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తుంటే పోలీసులు, అటవీ శాఖ అధికారులు పట్టుకొంటున్నారనే ఇలా ఆయిల్ ట్యాంకర్ లో వీటిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు స్మగ్లర్లు చెప్పడం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది.